30-01-2026 12:00:00 AM
రూ 7. 96 కోట్ల విలువ చేసే గంజాయిన దహనం
భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 29, (విజయక్రాంతి): డిస్టిక్ డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో రూ 7.96 కోట్ల విలువ గల గంజాయిని దహనం చేశారు. జిల్లాలోని 08 పోలీస్ స్టేషన్లలో నమోదైన 13 కేసుల్లో వివిధ సందర్భాల్లో నిందితుల వద్ద నుండి సీజ్ చేసిన 1592 కేజిల నిషేధిత గంజాయిని బుధవారం, గురువారాల్లో తల్లాడ మండలం గోపాలపేట లోని బయో డిస్పోజల్ ప్లాంట్ పర్యావరణ కాలుష్య నియంత్రణ నిబంధనలను పాటిస్తూ జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో దహనం చేశారు. జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ చైర్మన్ అయిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సూచనలతో సభ్యులైన పాల్వంచ డిఎస్పీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో కోర్టు వారి అనుమతి తీసుకుని ఈ నిషేధిత గంజాయిని ఉదయం నుండి సాయంత్రం వరకు దశల వారీగా విభజించి దహనం చేశారు.
ఎన్ డి పి ఎస్ యాక్ట్ లోని నియమ నిబంధనల ప్రకారం జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో నిల్వ ఉన్న గంజాయిని దహనం చేయడం జరిగిందని ఎస్పీ తెలియజేసారు. కొందరు అక్రమార్జనలో భాగంగా గంజాయిని విక్రయిస్తూ పట్టణ,గ్రామీణ ప్రాంతాల్లోని యువతను ప్రలోభాలకు గురి చేస్తూ మత్తులోకి దించుతున్నారని, ఈ విధంగా ఆసాంఘీక కార్యకలాపాలకు పాల్పడే వారిని అరికట్టడం కోసం జిల్లా వ్యాప్తంగా రహస్య బృందాల్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎవరైనా గంజాయి , ఇతర మత్తు పదార్థాలను విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మత్తుకు బానిసలై గంజాయి లాంటి మత్తు పదార్ధాలను సేవించే వారిపై కూడా కేసులు నమోదు చేసి జైలుకు పంపడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్వంచ డిఎస్పీ సతీష్ కుమార్,డీసిఆర్బీ సీఐ శ్రీనివాస్,సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.