06-06-2025 01:23:12 AM
హుస్నాబాద్, జూన్ 5: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని వ్యవసాయ మార్కెట్ యార్డులో శుక్రవారం నుంచి మూడురోజులపాటు (ఈ నెల 6, 7, 8 తేదీలలో) నిర్వహించనున్న రైతు మహోత్సవం (రైతు మేళా) కార్యక్రమానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులు, అధిక దిగుబడులు, రాబడిని సాధించే మెలకువలను నేర్పించేందుకే ఈ రైతు మహోత్సవాన్ని నిర్వహించనున్నట్టు కలెక్టర్ మనుచౌదరి తెలిపారు.
గురువారం ఆయన ఇక్కడ రైతు మహోత్సవం కోసం చేసిన ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. అనంతరం మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. ‘సిద్దిపేట జిల్లా రైతుల కోసమే కాకుండా, కరీంనగర్, హనుమకొండ, జనగామ జిల్లాల నుంచి కూడా రైతులను ఈ కార్యక్రమానికి తీసుకువస్తున్నాం,‘ అని కలెక్టర్ తెలిపారు.
ఈ మహోత్సవంలో రైతులే కాకుండా, ఫార్మర్స్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్స్, వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ కళాశాలల ప్రొఫెసర్లు, వివిధ వ్యవసాయ సంబంధిత కంపెనీల ప్రతినిధులు, వ్యవసాయ, ఉద్యానవన, పట్టు పరిశ్రమ, పశుసంవర్ధక శాఖల అధికారులు వంటి అనేక మంది నిపుణులు, సంస్థలు భాగస్వాములు అవుతున్నారని కలెక్టర్ వివరించారు.
మహోత్సవానికి వచ్చే రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ మను చౌదరి తెలిపారు. రైతులకు మంచినీళ్లు, మరుగుదొడ్ల సౌకర్యం, మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశామన్నారు. వేల మంది రైతులు, ఇతర సందర్శకులు వస్తున్నందున ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా పోలీస్ శాఖకు ప్రత్యేక సూచనలు జారీ చేశామన్నారు.
విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా, ముందస్తు జాగ్రత్తల కోసం ఫైర్ సర్వీసెస్, మంచినీటి కోసం ఆర్ డబ్ల్యూ ఎస్, శానిటేషన్ పనుల కోసం మున్సిపాలిటీకి, ప్లాస్టిక్ నియంత్రణ కోసం స్టీల్ ప్లేట్లు, గ్లాసుల ఏర్పాటు కోసం పంచాయతీ సిబ్బందికి, భోజనాల కోసం డీఆర్ డీఏ అధికారులకు బాధ్యతలను అప్పగించినట్టు కలెక్టర్ వివరించారు.
మంత్రుల రాక
ఈ ప్రతిష్టాత్మక రైతు మహోత్సవానికి వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథులుగా హాజరవుతారని కలెక్టర్ తెలిపారు. వారితో పాటు ఇతర ప్రజా ప్రతినిధులను కూడా వ్యక్తిగతంగా ఆహ్వానించామని, వారి వీలును బట్టి హాజరయ్యే అవకాశం ఉందన్నారు.
ఏర్పాట్లను పర్యవేక్షించినవారిలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) అబ్దుల్ హమీద్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, హుస్నాబాద్ ఆర్డీవో రామ్మూర్తి, ఏసీపీ సదానందం, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్, జిల్లా మార్కెటింగ్ అధికారి నాగరాజు తదితరులున్నారు