06-06-2025 01:23:44 AM
అభినందించిన ఆర్టీసీ యాజమాన్యం
హైదరాబాద్, మే 5 (విజయక్రాంతి): విధి నిర్వహణలో మానవత్వం చాటిన తమ సిబ్బందిని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం అభినందించింది. హైదరాబాద్ బస్ భవన్లో గురువారం ఉన్నతాధికారులతో కలిసి 12 మంది ఉద్యోగులను సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ సిబ్బంది ఉద్యోగ నిర్వహణలోనే కాకుండా మానవత్వంలోనూ ముందుండటం అభినందనీయమని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ ప్రశంసించారు.
ఉద్యోగులు నిజాయతీని నిరూపించుకుంటుండటం చూస్తుంటే.. ప్రజల కోసం ఆర్టీసీ సిబ్బంది ఎంత అంకితభావంతో పనిచేస్తున్నారో తెలుస్తోందని అన్నారు. ఈ నెల 2న గజ్వేల్ ప్రజ్జాపూర్ డిపోనకు చెందిన బస్సులో జగదేవ్పూర్ వద్ద ఒక ప్రయాణికుడు తన బ్యాగును మరిచిపోయారు. గుర్తించిన కండక్టర్ ఓం ప్రకాశ్, డ్రైవర్ సలీమ్ బ్యాగ్ను డిపో అధికారులకు అప్పగించారు.
అందులో 15 తులాల బంగారం, రూ.3.50 లక్షల నగదు ఉంది. బాన్సువాడ డిపో బస్సులో ఈ నెల 4న ఓ ప్రయాణికుడు బ్యాగును మరిచిపోగా, జోగిపేట కంట్రోలర్ జన్నుబాయి, కండక్టర్ బస్వరాజు సాయంతో ఆ బ్యాగును ప్రయాణికుడికి అందజేశారు. అందులో రూ.2.50 లక్షల నగదు ఉంది.
ఇలా మణుగూరు డిపోనకు చెందిన డ్రైవర్ మహేశ్, కల్వకుర్తి డిపోనకు చెందిన కండక్టర్ ప్రసాద్, డ్రైవర్ అనిల్ కుమార్, ప్రసాద్, బాలరాజు, దేవరకొండ బస్ స్టేషన్లో స్వీపర్గా పనిచేస్తోన్న ముత్తమ్మ, ఆదిలాబాద్ డిపో కండక్టర్ రమణ, డ్రైవర్ గులాబ్లు ప్రయాణికులు మరిచిపోయిన విలువైన వస్తువులను తిరిగి ఇచ్చేసి మానవత్వం చాటుకున్నారు.