08-12-2025 01:16:28 AM
హుజూరాబాద్, డిసెంబర్ 7 (విజయక్రాంతి): అక్రమంగా నిల్వ ఉంచిన పేదల రేషన్ బియ్యాన్ని టాస్క్ ఫోర్స్ అధికారులు మెరుపు దాడి నిర్వహించి ఆదివారం పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు అధికారులు ఆదివారం ఉదయం కరీంనగర్ జిల్లా,హుజురాబాద్ పట్టణంలోని బోర్నపల్లి శివారులో గల వీరాంజనేయ రైస్ మిల్లుకు రెండు ఆటోల ద్వారా పీడీఎస్ బియ్యాన్ని తరలిస్తుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
రెండు ఆటోలలో ఆరు క్వింటాళ్ల బియ్యాన్ని, రైస్ మిల్లులో నిల్వ ఉంచిన 329 క్వింటాళ్ల బియ్యాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. చిగురుమామిడి మండలం కొండాపూర్, బొమ్మనపల్లి గ్రామాలకు చెందిన కొంతమంది వ్యక్తులు రేషన్ బియ్యాన్ని సేకరించి హుజురాబాద్ పట్టణంలోని వీరాంజనేయ రైస్ మిల్లుకు దిగుమతి చేస్తున్నట్లు గుర్తించారు.
సీజ్ చేసిన రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులకు అప్పగించి హుజూరాబాద్ ఎంఎల్ఎస్ పాయింట్ కు తరలించారు. మిల్లు యజమానిపై 6 ఏ కేసు నమోదు చేసినట్లు వారు తెలిపారు. ఈ దాడుల్లో సివిల్ సప్లై అధికారులు ఓఎస్ డి ప్రభాకర్, ప్రత్యేక అధికారి లక్ష్మారెడ్డి, టాస్క్ ఫోర్స్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వసంత్ కుమార్, ఎస్త్స్ర జంపయ్య, కానిస్టేబుళ్లుపాల్గొన్నారు.