21-12-2025 05:54:24 PM
తుంగతుర్తి,(విజయక్రాంతి): రాజీ మార్గమే రాజ మార్గమని జూనియర్ సివిల్ కోర్టు జడ్జి ఎండి.గౌస్ పాషా అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని జూనియర్ సివిల్ కోర్టు ఆవరణలో నిర్వహించిన జాతీయ మెగా అదాలత్ లో పాల్గొని మాట్లాడారు. సుదీర్ఘకాలంగా సివిల్, క్రిమినల్ పెండింగ్ కేసులతో ఇబ్బంది పడుతున్న కక్షిదారులు జాతీయ లోక్ అదాలత్ ద్వారా రాజీ చేసుకోవాలన్నారు. క్షణికావేశంలో జరిగే తప్పులను సరిదిద్దుకోవాలన్నారు.
కక్షలు పెంచుకుని కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని వృథా చేసుకోవద్దని, న్యాయశాఖ అందిస్తున్న ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రజలు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని, సివిల్, క్రిమినల్ కేసులపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అన్నెపర్తి జ్ఞానసుందర్, న్యాయవాదులు, సర్కిల్ సీఐలు నరసింహారావు నాగేశ్వరరావు, ఎస్ఐలు క్రాంతి కుమార్, నాగరాజు, వీరన్న, సైదులు, మహేష్, వెంకట్ రెడ్డి, పోలీస్ సిబ్బంది, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.