ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలి
హనుమకొండ టౌన్, మార్చి 27 (విజయక్రాంతి): హనుమకొండ శ్రీనగర్ కాలనీ కేయూ ఎంప్లాయిస్ కాలనీలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని, ధర్మసేతు గ్లోబల్ వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీకాంత్ అనగంటి ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల దివ్య కళ్యాణ మహోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి పాల్గొని, శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం ఆశీర్వాదాలు పొందినారు. అనంతరం వారు మాట్లాడుతూ శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ అందరికీ శ్రీరామనవ శుభాకాంక్షలు తెలిపారు.
ముందుగా వేద పండితుల మంత్రోచ్ఛ రణాల మధ్య శ్రీ సీతారాముల దివ్య కళ్యాణం సంప్రదాయబద్ధంగా నిర్వహించబడింది. అనంతరం ఎదురుకోలు, కళ్యాణ మహోత్సవం, ఆశీర్వచనం, తీర్థ ప్రసాదములు, తలంబ్రాల వితరణ కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం శ్రీ సీతారాముల దివ్య శోభాయాత్రను ఘనంగా పలు కాలనీలలో భక్తి శ్రద్దలతో, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని, భజనలు, నామసంకీర్తనలు చేస్తూ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు డాక్టర్ దాస్యం అభినవ్ భాస్కర్, గుజ్జుల వసంత మహేందర్ రెడ్డి, గౌరవ అధ్యక్షులు గడ్డం భాస్కర్, శోభ కుమారస్వామి, కాలనీ పెద్దలు చందుపట్ల సుదర్శన్, సరళ, భక్తులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.




