22-06-2025 12:10:03 AM
- 21 నుంచి 26 వరకు యాంటీ డ్రగ్ అవేర్నెస్ వీక్
- లాంఛనంగా ప్రారంభించిన డీజీపీ జితేందర్
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూన్ 21 (విజయక్రాంతి): రాష్ర్టంలో మాదక ద్రవ్యాల నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకుంటామని, డ్రగ్స్ సరఫరాదా రులపై, వినియోగదారులపై ఉక్కుపాదం మోపుతామని డీజీపీ జితేందర్ స్పష్టం చేశారు. డ్రగ్స్ నిర్మూలన లక్ష్యంగా తెలంగాణ నార్కోటిక్ బ్యూరో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యాంటీ డ్రగ్ అవేర్నెస్ వీక్ను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ నెల 21 నుంచి 26వరకు కొనసాగే ఈ యాంటీ డ్రగ్ అవేర్నెస్ వారోత్సవాల్లో భాగంగా డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే అనర్థాలపై నార్కోటిక్ బ్యూరో విద్యార్థులకు, యువతకు విస్తృతంగా అవగాహన కల్పించనుంది.
ఈ కార్యక్రమానికి హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన, టీజీఏఎన్బీ డైరెక్టర్ సందీప్ శాండిల్యతో పాటు వివిధ కళాశాలల విద్యార్థులు, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా డీజీపీ జితేందర్ మాట్లాడుతూ.. డ్రగ్స్ వల్ల సమాజానికి అనేక అనర్థాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. యువత డ్రగ్స్కు అలవాటు పడి విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. నో టు డ్రగ్స్ అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ప్రతి విద్యార్థి తమ స్నేహితులు, కుటుంబ సభ్యుల్లో కనీసం పదిమందికి సే నో టు డ్రగ్స్ అని చెప్పాలని డీజీపీ జితేందర్ పిలుపునిచ్చా రు. కార్యక్రమంలో తెలంగాణ నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్య మాదక ద్రవ్యాల జోలికి అస్సలు వెళ్లవద్దని విద్యార్థులతో ప్రమాణం చేయించారు.