21-06-2025 11:58:24 PM
ఎంఈఓ నకిరేకంటి రవి..
పెన్ పహాడ్: ఒడిదుడుకుల మానవ జీవనశైలిలో ఖర్చు లేని యోగ, ధ్యానంతోనే చక్కటి మార్గాలని ఎంఈఓ నకిరేకంటి రవి(MEO Nakirekanti Ravi) అన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం(International Yoga Day) వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. యోగా దినోత్సవం ప్రాముఖ్యతను, యోగా సాధన వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలను వివరించారు. పురాతన కాలంలో మనదేశంలో పతంజలి మహర్షి రూపొందించిన యోగ సూత్రాల ప్రాముఖ్యతను గుర్తించి 2014లో ఐక్యరాజ్యసమితి జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించడం భారతీయులందరికీ గర్వకారణమని, భారతదేశంలో ఉద్భవించిన యోగ శాస్త్రం నేడు ప్రపంచవ్యాప్తంగా అందరూ అనుసరించటం యోగా ప్రాముఖ్యతను తెలియజేస్తుందని అన్నారు.
శరీరాన్ని మనసును ఏకం చేసే ధ్యానం, యోగాసనాలు, సూర్య నమస్కారాలు ఉత్తమమైన వ్యాయామ సాధనాలని, ప్రతిరోజు వీటిని అనుసరించటం వలన మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వారు అన్నారు. అనంతరం పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు రవికుమార్ ఆధ్వర్యంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు యోగాసనాలు, సూర్య నమస్కారాలు, ధ్యానం మొదలైనవి సాధన చేశారు. యోగా డే ఆకారంలో విద్యార్థులు వరుసలో కూర్చొని కార్యక్రమానికి ప్రధాన ఆకర్షణగా నిలిచారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు విద్యార్థులున్నారు.