02-06-2025 12:22:14 AM
జిల్లాలో 9 మంది పోలీసులకు ఉత్తమ సేవా పతకాలు
మెదక్, జూన్ 1(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్బంగా ప్రభుత్వం విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన పోలీస్ అధికారులకు సేవా పతకాలను ప్రకటించింది. ఇందులో మెదక్ జిల్లాకు 9 పథకాలను ప్రభుత్వం అందజేయనుంది. జిల్లా నుండి మహోన్నత సేవా పతకం జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ను వరించింది. ఈయన ఎస్.ఐ స్థాయి నుండి అదనపు ఎస్పీగా అంచెలంచెలుగా ఎదిగారు.
2018లో ఉత్తమ సేవా పతకం, 2025లో మహోన్నత సేవా పతకంతో పాటు తన సర్వీసులో వంద రివార్డులు, అవార్డులు పొందారు. 2023లో మెదక్ అడిషనల్ ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. అలాగే ఉత్తమ సేవా పతకం ఆర్ఎస్ఐ యశ్వంత్రావు, సేవా పతకాలు పాపన్నపేట ఏఎస్ఐ గాలయ్య,
మనోహరాబాద్ ఏఎస్ఐ కె.ఎన్.మూర్తి, మెదక్ ఏఆర్ ఎస్ఐ హెచ్.మోహన్, మెదక్ డీఎస్బీ హెడ్ కానిస్టేబుల్ జి.రాములు, మెదక్ ఏఆర్ హెడ్ కానిస్టేబుళ్లు ఎం.వైద్యనాథ్, ఎం.బస్వరాజ్, చేగుంట కానిస్టేబుల్ కె.రాజులు ఎంపికయ్యారు. వీరికి సోమవారం నిర్వహించే అవతరణ దినోత్సవంలో పతకాలను అందించనున్నారు.