11 April, 2026 | 4:15 AM

పాఠశాల కూల్చేస్తే చర్యలు తీసుకోరా?

11-04-2026 02:25 AM

మెదక్ ఎంపీ రఘునందన్ రావు 

పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంపీ

పటాన్‌చెరు, ఏప్రిల్ 10(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు డివిజన్ పరిధిలో జిల్లా పరిషత్ పాఠశాలను కొందరు అక్రమార్కులు జేసీబీలతో కూల్చివేయటంపై మెదక్ ఎంపీ రఘునందన్ సీరియస్ అయ్యారు. ఈ విషయమై పటాన్ చెరు పోలీసులు కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

స్వాతంత్య్రం వచ్చిన అనంతరం నుంచి జెడ్పీ పాఠశాల కొనసాగుతుందని ఈ స్థలం తమదే అని కొందరు వ్యక్తులు కోర్టులో కేసు వేయగా ఆ స్థలంపై వివాదం కోర్టు పరిధిలో ఉందని అన్నారు.పాఠశాల భవనాన్ని మూడు రోజుల క్రితం కొందరు అక్రమార్కులు రాత్రికి రాత్రి జేసీబీలతో కూల్చివేయగా డయల్ 100 ద్వారా మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఫిర్యాదు చేశారు.

కానీ ఇంతవరకు వారిపై కేసు నమోదు కాలేదని ఫ్రెండ్లీ పోలీసులమని చెప్పుకునే తెలంగాణ పోలీసులు దొంగలకు సద్ది కట్టేలా వ్యవహరించడం సరికాదని రఘునందన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.బాధ్యత గల ప్రజా ప్రతినిధిగా,మెదక్ ఎంపీగా  జిల్లా కలెక్టర్‌కు,ఆర్డీవోకు, స్థానిక తహసీల్దార్‌కు ఫిర్యాదు చేసిన నివేదికలు తెప్పించుకుంటున్నామని చెప్తున్నారు కానీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు.

ఒక సామాన్యుడు ఏదైనా నిర్మాణం కోసం మట్టి నింపుకుంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటారని లారీలను సీజ్ చేస్తారు, కానీ కోట్ల విలువ చేసే భూమిపై అక్రమార్కులు కన్నేస్తే ఇప్పటివరకు చర్యలు ఎందుకు తీసుకోలేదని రఘునందన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.తనకు తెలంగాణ పోలీసులపై నమ్మకం ఉందని సదరు వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటారని లేనిపక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు.