మెడికో విద్యార్థి ఆత్మహత్య.. కేసు దర్యాప్తు చేస్తున్న ఉప్పల్ పోలీసులు
ఉప్పల్ ఆగష్టు 16 (విజయక్రాంతి): ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామంతాపూర్లో విషాద ఘటన చోటుచేసుకుంది. పీఎస్ కాలనీకి చెందిన కోల్కూరి భరద్వాజ్(18), ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి, భవనంపై నుంచి దూకి మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు యువకుడు తెల్లవారుజామున ఇంటి నుంచి కనిపించకుండా పోయినట్లు ఉప్పల్ పోలీసులకు సమాచారం అందింది.
వెంటనే పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అనంతరం ఉదయం డయల్-100 ద్వారా అందిన సమాచారంతో ఎన్ఎస్ఎల్ నిర్మాణంలో ఉన్న భవనం వద్ద యువకుడు మృతి చెందినట్లు గుర్తించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఉప్పల్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ చిరంజీవి ఆధ్వర్యంలో పోలీసులు పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతికి గల కారణాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. యువకుడి మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.






