అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం ఫీజు బకాయిలు కోసం
చెన్నూర్, (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను విడుదల చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ బిజెపి నాయకులు మంచిర్యాల జిల్లా చెన్నూర్ లో ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ పాత బస్టాండ్లోని అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయకుండా ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతోందని మండిపడ్డారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు గర్రెపల్లి వెంకట నర్సయ్య, మాణిక్రౌతు శంకర్, ఆడుప శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.






