30-06-2025 02:25:36 AM
ఏపీలో కలిసిన నాలుగు పంచాయతీల కోసం మంత్రి తుమ్మల వినతి
భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 29 (విజయక్రాంతి): ఏపీ పునర్విభజన చట్టం 2014 లో భాగంగా ఏపీలో కలిసిన భద్రాచలం పరిసర గ్రామాలైన యాటపాక, కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు, పురుషోత్తం పట్నం లను తిరిగి తెలంగాణలో విలీనం చేయాలని కేంద్ర మంత్రి అమిత్షాను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. ఈ సందర్భంగా అమిత్షాకు వినతిపత్రం అందజేశారు.
భద్రాచలం పట్టణం తెలంగాణలో కొనసాగుతుండగా యటపాక, కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు, పురుషోత్తపట్నం గ్రామ పంచాయతీలు ఏపీలో కలవడంతో అనేక పరిపాలనా, అభివృద్ధి ఇబ్బందులు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. భద్రాచలం పట్టణం, తెలంగాణ ప్రధాన మండలాల మధ్య రవాణా అంతరాయం ఏర్పడుతుందని చెప్పారు.
రాకపోకల్లో, రెండు రాష్ట్రాల చెక్పోస్టుల వల్ల భద్రాచలంలోని విద్యాసంస్థల్లో చదివే గిరిజన విద్యార్థులు, వాణిజ్య వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.. ఎల్డబ్ల్యూఈ ప్రభావిత ప్రాంతం కావడం వల్ల లా అండ్ ఆర్డర్ సమస్యలు కూడా ఏర్పడుతున్నాయని, దేవస్థానం భూములు ఏపీ పరిధిలో ఉండటంతో దేవస్థానం నిర్వహణకు కూడా ఇబ్బందులు కలుగుతున్నాయ ని చెప్పారు.