మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి
కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలంటూ రైతులకు పిలుపు
ధర్మపురి, ఏప్రిల్10(విజయక్రాంతి): రబీ సీజన్ లో రైతులు పండించిన మొక్కజొన్న పంటకు మద్దతు ధర కల్పించాలనే ముఖ్య ఉద్దేశ్యంతో ప్రభుత్వం డీసీ ఎంఎస్ ల ద్వారా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని, రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ రైతులకు పిలుపునిచ్చారు.
శుక్రవారం ధర్మపురి వ్యవసాయ మార్కెట్ లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రైతులు ధర్మపురి నియోజకవర్గంలో 25% అధికంగా మొక్కజొన్న సాగు చేశారని అన్నారు. ధర్మపురి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో సుమారుగా 1.46 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని వ్యవసాయ అధికారులు అంచనా వేశారని మంత్రి తెలిపారు.
రైతులు పెద్ద ఎత్తున పంట సాగు చేసిన నేపథ్యంలో రైతులకు మద్దతు ధర కల్పించాలని ప్రభుత్వం మెక్కజోన్నల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వివరించారు.రైతులు పండించిన పంటను దళారులు క్వింటాలుకు రూ. 1600 మాత్రమే చెల్లించి కొనుగోలు చేస్తున్నారని మంత్రి వివరించారు. రైతులకు మద్దతు ధర అందించాలని ప్రజా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తుందని మంత్రి తెలిపారు. రైతులు కొనుగోలు కేంద్రాల్లో మొక్కజొన్నలు విక్రయించి క్వింటాలుకు రూ. 2400 మద్దతు ధర పొందాలని మంత్రి కోరారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ ధర్మపురి మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుముల లావణ్య లక్ష్మణ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంగనభట్ల దినేష్, ధర్మపురి మున్సిపల్ చైర్మన్ వేముల నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.




