26-05-2025 05:11:21 PM
మంత్రి జూపల్లి కృష్ణారావు..
అచ్చంపేట: కేసీఆర్ దేవుడు.. కానీ, ఆయన చుట్టూ కొన్ని దెయ్యాలు ఉన్నాయని ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) చేసిన వ్యాఖ్యలపై మంత్రి జూపల్లి(Minister Jupally Krishna Rao) స్పందిస్తూ... కేసీఆర్.. దేవుడే అయితే తన చుట్టూ ఉన్న దెయ్యాలకు నాయకత్వం ఎలా వహించారని దెయ్యాలకు నాయకత్వం వహించిన నీ తండ్రి దేవుడు ఎట్లా అవుతారని ప్రశ్నించారు. సోమవారం నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో 132/33 కేవీ & 33/11 కేవీ సబ్ స్టేషన్ల నిర్మాణ పనులకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క(Deputy CM Mallu Bhatti Vikramarka)తో కలిసి మంత్రి జూపల్లి కృష్ణారావు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ... అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ కు ఓటు వేస్తే రాష్ట్రం అంధాకారం అవుతుందని, కరెంట్ ఉండదని కల్లబొల్లి మాటలు చెప్పారని, అయినా ప్రజలు ఆయన్ను నమ్మలేదని, కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించారన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అప్పుల కుప్పగా మారి అధోగతి పాలైందని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి భాగా లేకున్నా.. ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని, గతంలో ఉన్న సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే.. ఆరు గ్యారంటీలను కూడా అమలు చేస్తున్నామని చెప్పారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, సన్నాలకు బోసన్, రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ, ఇంటిగ్రేటేడ్ స్కూల్స్, బీసీ కుల గణన, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ లాంటి ఎన్నో వినూత్నమైన పథకాలను అమలు చేస్తున్నామని వివరించారు.
ఇంత చేస్తుంటే మొన్నటి వరంగల్ సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలన చూస్తుంటే దుఃఖం వస్తుందన్నారని అయితే కేసీఆర్ కు.. అధికారం దూరమైనందుకు దుఃఖం వస్తుందా? కవిత చెప్పినట్లు ఆయన చుట్టూ ఉన్న దయ్యాలను చూసి దుఃఖం వస్తుందా? అని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజల అకాంక్షలకు అనుగుణంగా పాలన సాగుతుందని, ప్రజల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక బీఆర్ఎస్ మీడియా, సోషల్ మీడియా మా ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తుందన్నారు. ప్రజలు అసత్య ప్రచారాలను నమ్మవద్దని, వాస్తవాలను గ్రహించాలని కోరారు. దేశానికైనా, రాష్ట్రానికైనా కాంగ్రెస్ పార్టీయే శ్రీరామరక్ష అని తెలిపారు.