నేడు పాలేరు నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి పర్యటన
- ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 17 వార్డులకు ‘ప్రజాదర్బార్’
- వరంగల్ క్రాస్ రోడ్డు సెయింట్ జోసెఫ్స్ హైస్కూల్ మైదానంలో నిర్వహణ
- వివరాలు వెల్లడించిన మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ
- ఇంచార్జి తుంబూరు దయాకర్ రెడ్డి
ఖమ్మం, కూసుమంచి, జూన్ 7 (విజయ క్రాంతి): సామాన్యుల సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలనే సంకల్పంతో తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి చేపట్టిన ‘ప్రజా దర్బార్’ కార్యక్రమం పాలేరు నియోజకవర్గంలో విజయవంతంగా జరుగుతోంది. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పనిలేకుండా, అధికారులే నేరుగా ప్రజల వద్దకు వచ్చి వినతులు స్వీకరిస్తుండటంతో ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఇందులో భాగంగా సోమవారం మధ్యాహ్నం 3:00 గంటలకు ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని వరంగల్ క్రాస్ రోడ్డు ప్రాంతంలో గల సెయింట్ జోసెఫ్స్ హై స్కూల్ మైదానంలో చివరి ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ దర్బార్కు మున్సిపాలిటీ పరిధిలోని 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 25, 26, 27, 28, 29 వార్డుల ప్రజలు పెద్ద ఎత్తున హాజరుకావాలని మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్ చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి కోరారు.
వేదికలపైనే పరిష్కారం!
ప్రధానంగా భూ సమస్యలు, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి, పరిష్కార దిశగా తక్షణ చర్యలు చేపట్టాలని ఇప్పటికే మంత్రి పొంగులేటి అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అన్ని శాఖల అధికారులు ఈ వేదికపై అందుబాటులో ఉంటారు. ప్రజల ప్రతి విన్నపాన్ని నేరుగా పర్యవేక్షిస్తామని, అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. పైన పేర్కొన్న 17 వార్డుల ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆయా వార్డుల కౌన్సిలర్లు, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని దయాకర్ రెడ్డి కోరారు. అలాగే కూసుమంచి మండలంలో మంత్రి పొంగులేటి పర్యటిస్తున్నారని తెలిపారు.






