- జైలుకు వెళ్లాలని కేటీఆర్ కే కుతూహలంగా ఉన్నట్లు ఉంది.
- స్థానిక ఎన్నికలపై నాలుగైదు రోజుల్లో స్పష్టత వస్తుందని చెప్పాను.
- నోటిఫికేషన్ గురించి ఎక్కడ మాట్లాడలేదు.. మాట మార్చలేదు.
- ఈరోజు జరిగే మంత్రుల సమావేశంలో పూర్తి స్పష్టత.
- అందరి అభిప్రాయాల తర్వాతే నిర్ణయం: మంత్రి సీతక్క
- హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలకు(Local Body Elections) వారంలో నోటిఫికేషన్ వస్తుందని నేను చెప్పలేదు.. స్థానిక ఎన్నికలు ఎప్పుడుంటాయో వారంలో స్పష్టత వస్తుందని అన్నానని మంత్రి సీతక్క(Minister Seethakka) క్లారిటీ ఇచ్చారు. కేబినెట్ లో నిర్ణయం జరగకుండా నేనెలా చెబుతాను? అని ప్రశ్నించారు. స్థానికసంస్థల ఎన్నికలపై నేడు స్పష్టత వస్తుందని భావిస్తున్నామని చెప్పారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని సీతక్క పునరుద్ఘటించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(Kalvakuntla Taraka Rama Rao) కే జైలుకు వెళ్లాలని కుతూహలంగా ఉన్నట్లు ఉందని సీతక్క(Seethakka) ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ కవిత జైలుకు వెళ్లి రాగానే బీసీలు, మహిళలు, దళితులపై ప్రేమ ఒలకబోస్తున్నారని సీతక్క ఆరోపించారు. ప్రభుత్వం చట్టప్రకారమే వెళ్తుంది.. ఎలాంటి కక్షలు లేవని మంత్రి సీతక్క సూచించారు.
అటు మంత్రి పొంగులేటిపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్(PCC Chief Mahesh Kumar Goud) ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలపై పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటన చేయడాన్ని మహేష్ కుమార్ గౌడ్ తప్పుబట్టారు. కేబినెట్ లో చర్చించాల్సిన అంశాలను ముందుగానే మాట్లాడితే ఎలా.. ఒకరి మంత్రిత్వ శాఖపై వేరొకరు మాట్లాడటం సరైంది కాదని హెచ్చరించారు. కోర్టు పరిధిలో ఉన్న అంశాలపై జాగ్రత్తగా మాట్లాడాలని సూచించారు. పార్టీతో సంప్రదించకుండా ఏ ఒక్కరు ప్రకటనలు చేయవద్దని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ వార్నింగ్ ఇచ్చారు.