మంత్రి పొంగులేటిపై పీసీసీ చీఫ్ సీరియస్
- మంత్రి పొంగులేటిపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం.
- స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రకటన చేయడంపై మహేష్ గౌడ్ ఫైర్.
- ఎన్నికలపై పొంగులేటి ప్రకటన చేయడాన్ని తప్పుబట్టిన పీసీసీ చీఫ్.
- ఒకరి మంత్రిత్వ శాఖపై వేరొకరు మాట్లాడటం సరైంది కాదు.
- కోర్టు పరిధిలో ఉన్న అంశాలపై జాగ్రత్తగా మాట్లాడాలి.
- పార్టీతో సంప్రదించకుండా ఏ ఒక్కరు ప్రకటనలు చేయొద్దు.
హైదరాబాద్: రాష్ట్ర సమాచార, రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై(Minister Ponguleti Srinivas Reddy) పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రకటన చేయడంపై మహేష్ కుమార్ గౌడ్(TPCC President) మండిపడ్డారు. రిజర్వేషన్లతో ముడిపడిన అంశంపై ముందస్తు ప్రకటన సరికాదని సూచించారు. కేబినెట్ లో చర్చించకుండానే ముందుకు ఎలా ప్రకటిస్తారు..?, ఒకరి మంత్రిత్వ శాఖ అంశంపైన మరొకరు మాట్లాడటం ఏంటి..?, అని ప్రశ్నించారు. కోర్టు పరిధిలో ఉన్న అంశాలపై మంత్రులు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని పీసీసీ అధ్యక్షుడు(PCC Chief Mahesh Kumar) మందలించారు. పార్టీతో సంప్రదించకుండా అలాంటి ప్రకటనలు చేయవద్దని హెచ్చరించారు. మంత్రులు వారి శాఖల పరిధిలోని అంశాలను మాత్రమే మాట్లాడాలని చెప్పారు.
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు(Telangana Local Body Elections) ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్ జారీ చేస్తామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదివారం అన్నారు. కేవలం 15 రోజులు మాత్రమే మిగిలి ఉన్నందున, అంతర్గత విభేదాలను పక్కనపెట్టి పార్టీ విజయం కోసం ఐక్యంగా పనిచేయాలని ఆయన కాంగ్రెస్ నాయకులకు పిలుపునిచ్చారు. ఖమ్మంలో పలైర్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ నాయకుల సమావేశంలో ప్రసంగించిన మంత్రి, తదుపరి మంత్రివర్గ సమావేశం తర్వాత ఎన్నికల తేదీలపై మరింత స్పష్టత వస్తుందన్నారు. ఎన్నికలు దశలవారీగా జరుగుతాయన్న ఆయన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల తరువాత పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని వెల్లడించారు. గ్రామాల్లోని నాయకుల మధ్య సరైన సమన్వయం ఉండాలని, ప్రజా సమస్యలను పరిష్కరించడంపై శ్రద్ధ వహించాలని కోరారు. పార్టీ విస్తృత ప్రయోజనాల దృష్ట్యా చిన్న చిన్న తేడాలు ఉంటే పట్టించుకోవద్దని చెప్పారు. రిజర్వేషన్ ప్రమాణాలు, గెలుపు అవకాశాల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.






