దావోస్ పెట్టుబడులపై అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు సమాధానం
- పెట్టుబడుల ఒప్పందాలపై శ్వేతపత్రం విడుదల చేస్తాం
- దావోస్ పర్యటనల్లో 44 ఎంవోయూలు
- పెట్టుబడులతో 68,150 మంది ప్రత్యక్ష ఉద్యోగాలు
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. శాసనసభలో మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) మాట్లాడుతూ... నిజామాబాద్ ఐటీ టవర్ లో 11 కంపెనీలు కార్యకలాపాలు జరుగుతున్నాయని తెలిపారు. 681 సీట్ల సామర్థ్యంతో ఐటీ టవర్ నిర్మించామన్నారు. ప్రస్తుతం 276 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని తెలిపారు. దావోస్ పెట్టుబడులపై(Davos Investments) అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు సమాధానం ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రానికి రూ. 2.19 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని వెల్లడించారు. దావోస్ పర్యటనల్లో 44 ఎంవోయూలను ప్రభుత్వం కుదుర్చుకుందని స్పష్టం చేశారు. పెట్టుబడులతో 68,150 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు కల్పించామన్నారు.
2024 దావోస్ లో 18 ఎంవోయూలు.. రూ, 40, 232 కోట్లు పెట్టుబడులు, 2025 దావోస్ లో 26 ఎంవోయూలు.. రూ. 1,78,950 కోట్లు పెట్టుబుడులు వచ్చాయని తెలిపారు. రూ. 81,800 కోట్ల పెట్టుబడులతో 6 కంపెనీలకు భూములు కేటాయించినట్లు వెల్లడించారు. భూముల కేటాయింపుతో ప్రభుత్వానికి రూ. 1,540 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. మరో 3 కంపెనీలకు రూ. 30 వేల కోట్ల పెట్టుబడుల కోసం భూములు గుర్తించామని తెలిపారు. పెట్టుబడుల ఒప్పందాలపై శ్వేతపత్రం విడుదల చేస్తామని మంత్రి సూచించారు. పరిశ్రమల ఏర్పాటు వల్ల రాష్ట్రానికి బహుళ ప్రయోజనాలు, ఉఫాది లభిస్తోందని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు.




