20-06-2025 10:31:32 PM
తల్లాడ మండలం నారాయణపురంలో నిర్మించిన రోడ్డును ప్రారంభోత్సవం చేసిన మంత్రివర్యులు పొంగులేటి
తల్లాడ (విజయక్రాంతి): పేదలకు అండగా ఇందిరమ్మ ప్రభుత్వ పాలన సాగుతోందని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Minister Ponguleti Srinivasa Reddy) అన్నారు. శుక్రవారం మంత్రి, తల్లాడ మండలం నారాయణపురం గ్రామంలో 5 కోట్ల 50 లక్షలతో నిర్మించిన రోడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ... ప్రజల దీవెనలతో రాష్ట్రంలో సంవత్సరంన్నర క్రితం ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, తల్లాడ-నారాయణ పురం-కొడవటిమెట్ట గ్రామాలను కలిపి 5 కోట్ల 50 లక్షలతో రోడ్డు నిర్మించామని అన్నారు.
గత పాలకులు అమలు చేసిన పథకాలను కొనసాగిస్తూ, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని అన్నారు. అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలను పేదలకు చిత్తశుద్ధితో అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి ఎస్ఇ యాకోబ్, ఇఇ తానేశ్వర్, కల్లూరు ఆర్డీఓ ఎల్. రాజేందర్, పెనుబల్లి డిఇ ఎండి. ఖలీల్ అహ్మద్, తహసీల్దార్, ఎంపీడీఓ, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.