20 April, 2026 | 10:03 PM

రైతుకు మద్దతు ధర కల్పించడమే ప్రధాన లక్ష్యం

20-04-2026 08:25 PM

కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి

నాణ్యతా ప్రమాణాలు పాటించి గిట్టుబాటు ధర పొందాలి

లక్ష్మీదేవిపల్లిలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే

కొత్తగూడెం,(విజయక్రాంతి): మొక్కజొన్న రైతులకు మద్దతు ధర కల్పించి వారిని ఆర్థికంగా ఆదుకోవడమే ప్రధాన లక్ష్యమని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. మండలపరిధిలోని వ్యవసాయ మార్కెట్ యార్డు ఎవరణలో  ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు సరైన ధర కల్పించాలనే ఉద్దేశంతో నియోజకవర్గ పరిధిలో రెండు కేంద్రాల ఏర్పాటుకు కృషి చేయడం జరిగిందని తెలిపారు. రైతులు తమ పంటను దళారులకు తక్కువ ధరకు అమ్మి మోసపోవద్దని, ప్రభుత్వ కేంద్రాల్లోనే విక్రయించి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరను పొందాలని సూచించారు.

నియోజకవర్గంలోని రైతుల ఇబ్బందులను గమనించి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఈ కేంద్రాలను మంజూరు చేయించామని పేర్కొన్నారు. కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా తూకం, నగదు చెల్లింపుల విషయంలో పారదర్శకత పాటించాలని ఆదేశించారు. వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తూ నియోజకవర్గ రైతాంగానికి ఎల్లవేళలా అండగా ఉంటానని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. తహసీల్దార్ శిరీష, ఆర్ఐ కృష్ణ, హరీష్, సిపిఐ మండల కార్యదర్శి దీటి లక్ష్మిపతి, నిమ్మగడ్డ వెంకటేశ్వర్ రావు, స్థానికులు రాంబాబు, లక్ష్మణ్, కళ్యాణి, పాషా, తహసీల్దార్, చింటూ, నూనావత్ గోవిందు,  మిర్యాల రాము,  ప్రసాద్, మాధవరావు తదితరులు పాల్గొన్నారు.