19-06-2025 03:13:43 PM
లబ్ధిదారులకు వెంట వెంటనే బిల్లులు అందించాలి
సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరించాలి
లబ్ధిదారులకు ఇబ్బందులు కలగకుండా చూడాలి
స్టేషన్ ఘనపూర్: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా లబ్ధిదారులకు వెంట వెంటనే బిల్లులు అందే విధంగా చర్యలు తీసుకోవాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు. వేలేరు మండలం శాలపల్లి గ్రామంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి క్షేత్రస్థాయిలో పర్యటించి ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల వద్దకు స్వయంగా వెళ్లి లబ్ధిదారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
కొన్ని ఇళ్లకు సాంకేతిక సమస్యల కారణంగా బిల్లులు రావడం లేదని లబ్ధిదారలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. దీంతో సాంకేతిక సమస్యలేమైన ఉంటే వెంటనే పరిష్కరించి లబ్ధిదారులకు బిల్లులు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. లబ్ధిదారులకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఎలాంటి జాప్యం లేకుండా త్వరితగతిన నిర్మాణం పూర్తి చేసేలా అధికారులు పర్యవేక్షించాలన్నారు.
ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఎవరికీ కూడా ఒక్క రూపాయి లంచం ఇవ్వాల్సిన అవసరం లేదని, లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకోవాలని మీకు బిల్లులు ఇప్పించే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ శాఖ అధికారులు, తహసీల్దార్, ఎంపీడివో, ఇతర అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.