ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి
అధికారులకు ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆదేశం
టేకులపల్లి, జులై 13, (విజయక్రాంతి): ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం పనులను వేగవంతం చేసి, అర్హులైన ప్రతి కుటుంబానికి సొంతింటి కలను సాకారం చేయాలని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అధికారులను ఆదేశించారు. సోమవారం టేకులపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిపై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల స్థితిగతులను ఎంపీడీఓ శ్రీదేవి, హౌసింగ్ ఏఈ గణేష్ను అడిగి తెలుసుకున్నారు.
ఇప్పటివరకు మంజూరైన పరిపాలనా అనుమతులు, ప్రారంభమైన ఇళ్ల సంఖ్య, ఇంకా ప్రారంభం కాని ఇళ్లకు గల కారణాలు, నిర్మాణంలో ఉన్న ఇళ్ల పురోగతిపై అధికారులతో సమగ్రంగా చర్చించారు. ఇంకా ప్రారంభం కాని ఇళ్ల నిర్మాణాలను వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని, నిర్మాణంలో ఉన్న ఇళ్లను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందుబాటులోకి తీసుకురావాలని ఎమ్మెల్యే ఆదేశించారు. అధికారులు ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షిస్తూ ఎలాంటి అవరోధాలు లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రభుత్వం పేదల గృహ కలను నిజం చేసేందుకు కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు.






