03-11-2025 12:34:47 PM
							చదివే మీ భవిష్యత్తు అంటూ అవగతం చేయండి
చిరు వ్యాపారులకు గుర్తింపు కార్డులు ఇచ్చిన ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్,(విజయక్రాంతి): మీ బిడ్డలు ఎంతవరకు చదువుతామంటే అంతవరకు చదివించాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి(MLA Yennam Srinivas Reddy) అన్నారు. సోమవారం మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చిరు వ్యాపారులకు గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే వ్యాపారులకు కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చదువు బాగా చదివితే జీవితం ఎలా ఉంటుందో మీ బిడ్డలకు అర్థమయ్యేలా చెప్పాలని సూచించారు.
ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు వీధి వ్యాపారులకు తైబజార్ రద్దు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుబాటులో ఉందని, తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివించాలని ప్రజలను కోరారు. గత ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని విమర్శించారు. ఆరోగ్య భీమా ఉన్న ప్రతి ఒక్కరు ధైర్యంగా జీవించగలరని, అందరూ ఆరోగ్య భీమా పొందాలని సూచించారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని గత ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపిస్తూ, “ఇందిరమ్మ రాజ్యంలో అర్హులైన ప్రతి పేదవారికి సొంతింటి కల నెరవేరుస్తామని ఆయన స్పష్టం చేశారు” ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీని దీవించాలని, మాకు మీరంతా అండగా నిలవాలని ఎమ్మెల్యే గారు కోరారు.
అనంతరం నూతనంగా నిర్మిస్తున్న వెజ్ నాన్ వెజ్ మార్కెట్ ను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎన్ పి వెంకటేష్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పెద్ద విజయ్ కుమార్, జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఇంచార్జి గోనెల శ్రీనివాస్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు చిన్న, ఉమర్ , మునీర్, మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి చిరు వ్యాపారుల సంక్షేమ సంఘం సభ్యులు ఎం చందు, ఎన్ వెంకటేష్, ఆంజనేయులు , అన్నపూర్ణ, జగదీష్, సి.కృష్ణ మరియు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు .