31-05-2025 04:44:40 PM
- మీ వెన్నంటే ఉంటా మీ ఎదుగుదలకు తోడ్పాటు అందిస్తాం
- అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను సన్మానించిన ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి..
మహబూబ్ నగర్ (విజయక్రాంతి): విద్యార్థులు ప్రతిరోజు దినపత్రికలను చదివే అలవాటు చేసుకోవాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి(MLA Yennam Srinivas Reddy) అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఐడిఓసి సమావేశ మందిరంలో పదవ తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. ఈ మేరకు ఎమ్మెల్యే సౌజన్యంతో నిర్వహించిన కెరీర్ గైడెన్స్ కార్యక్రమానికి భారీగా విద్యార్థులు వచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పదవ తరగతిలో మీరు సాధించిన ఫలితాలు కార్పోరేట్ విద్యాసంస్థలలో చదువుతున్న విద్యార్థులతో సమానంగా వచ్చాయని చెప్పారు.
తాను ఎమ్మెల్యేగా విజయం సాధించిన వెంటనే నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి అక్కడ డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేయడం, డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్స్ ను పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా అందించడంతో 45% ఉన్న ఫలితాలు ఒకేసారి 20 నుంచి 30% పెరిగాయన్నారు. పత్రికలు చదివితే ఎన్నో పోటీ పరీక్షలకు ఉపయోగపడుతుందని చెప్పారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ కళాశాలల్లో చేర్పిస్తే అత్యున్నతమైన విద్యను అందించేందుకు ప్రభుత్వ కళాశాలల్లో నిష్ణాతులైన అధ్యాపకులు అందుబాటులో ఉన్నారని చెప్పారు.
గత విద్యా సంవత్సరం మహబూబ్ నగర్ ఫస్ట్ నవరత్నాలు ఆధ్వర్యంలో ఇచ్చిన ఎప్సెట్, నీట్ కోచింగ్ పొందిన విద్యార్థులకు ఇంజనీరింగ్ , అగ్రికల్చర్, ఫార్మసీ లలో 114 మందికి రాష్ట్ర స్థాయి ర్యాంకులు వచ్చాయన్నారు. పాలమూరు బిడ్డలకు కాస్త ప్రోత్సాహం ఇస్తే చాలు వారు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. రానున్న రెండు సంవత్సరాలు చదువుపైన శ్రద్ధ వహించి ఉన్నత స్థితికి చేరుకోవాలని ఆయన సూచించారు. ప్రభుత్వ కళాశాలల్లో ఎలాంటి వసతులు కావాలన్నా తప్పక కల్పిస్తామని హామీ ఇచ్చారు.
అనంతరం 500 మార్కులు పైన వచ్చిన విద్యార్థులను ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, డిఇఓ ప్రవీణ్ కుమార్, డిఐఇఓ కౌసర్ జహాన్, బాలుర జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ భగవంతచారి, సిఎంఓ బాలు యాదవ్, ఎఎంఓ డి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.