16 May, 2026 | 8:16 PM

బీసీ రిజర్వేషన్ల కోసం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలి: కవిత

22-07-2025 05:14 PM

హైదరాబాద్: కాంగ్రెస్, బీజేపీ కలిసి బీసీ రిజర్వేషన్లు అడ్డుకునే కుట్ర చేస్తున్నాయని తెలంగాణ జాగృతి సంస్థ వ్యవస్థాపకురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లును తెలంగాణ శాసనసభ, మండలి ఆమోదించిన దానిని బీజేపీ మతం రంగు పులిమిందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం పంపిన బిల్లును రాష్ట్రపతి వద్దకు కేంద్ర ప్రభుత్వం పంపలేదని, 42 శాతం బీసీ రిజర్వేషన్లను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ లో చేర్చలేమని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారని కవిత ఆరోపించారు.

ఉత్తరాది రాష్ట్రాల్లో 50 శాతం పైగా రిజర్వేషన్లు అమలవుతున్నాయని, దక్షిణాది రాష్ట్రాల్లో న్యాయ సమస్యలు అంటూ దాటవేస్తున్నారని ఎద్దేవా చేశారు. రిజర్వేషన్ల కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒత్తిడి తీసుకురాలేదని ఆమె చెప్పారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ల కోసం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు.