12-06-2025 05:22:51 PM
మోదీ పాలనలో దేశం గర్వించేలా అభివృద్ది..
కేంద్ర నిధులపై రాష్ట్ర ప్రభుత్వం అసత్య ప్రచారం..
బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు, ఎంపీ ఈటల రాజేందర్..
నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): గత 11 సంవత్సరాల్లో భారతదేశం అనేక రంగాల్లో అసాధారణ పురోగతి సాధించిందని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్(MP Etela Rajender) స్పష్టం చేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని బిజెపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అంతకుముందు మోడీ ప్రభుత్వం '11 ఏళ్ల అభివృద్ధి' కార్యక్రమాల సందర్భంగా పట్టణంలోని పద్మానగర్ లో చేనేత కార్మికులను పరామర్శించి హనుమాన్ నగర్ దేవాలయం వద్ద మొక్కని నాటారు. జిల్లా కార్యాలయంలో ఏర్పాటుచేసిన 11 ఏళ్ల సుపరిపాలనపై ఛాయచిత్ర ప్రదర్శనను ప్రారంభించారు.
గత 11 ఏళ్లలో మోడీ ప్రభుత్వం మీద ఒక్క అవినీతి ఆరోపణ కూడా రాలేదని, ఇది దేశ ప్రజల నమ్మకానికి నిదర్శనమన్నారు. పేద, అణగారిన వర్గాలకు పెద్దపీట వేసేలా మోడీ పాలన ఉండిందని అన్నారు. రైతులు, యువత, మహిళలు ఈ నాలుగు ప్రధాన విభాగాల అభివృద్ధి కోసమే ప్రతి కార్యక్రమం రూపకల్పన చేశారని అన్నారు. భారతదేశం నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని, ఇటీవలే 4 ట్రిలియన్ డాలర్స్ ఎకానమీగా మారిందని తెలిపారు. పన్నుల వ్యవస్థలో సమగ్ర మార్పులు చేసి, జీఎస్టీ ద్వారా “వన్ నేషన్ వన్ ట్యాక్స్” లక్ష్యాన్ని సాధించామని తెలిపారు. 2014లో 6.91 కోట్ల పన్నులు కట్టే వారు ఉండగా, ఇప్పుడు 15.66 కోట్లకు పెరిగిందని వివరించారు.
మరోవైపు దేశంలో అమృత్ భారత్ పథకం కింద 1300 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తుండగా 1.46 లక్షల కి.మీ. జాతీయ రహదారులు, 7.7 లక్షల కిమీ గ్రామీణ రహదారులు నిర్మించామని చెప్పారు. రైల్వే బడ్జెట్ 29,056 కోట్ల నుంచి 2.42 లక్షల కోట్లకు పెరిగిందని, 136 వందే భారత్ రైళ్లు ప్రారంభించామని వివరించారు. ఇక ఉడాన్ స్కీం ద్వారా సామాన్యులకూ విమానయానాన్ని అందుబాటులోకి తెచ్చామని, 2014లో 71 విమానాశ్రయాలు ఉండగా ఇప్పుడు 159కి పెరిగినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం 2014లో లాభాల్లో ఉన్న రాష్ట్రం, మోడీ విధానాలను పాటించకపోవడంతో ఇప్పటికి 10 లక్షల కోట్ల అప్పుల్లో కురుకు పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
సంక్షోభంలో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థను అద్భుతంగా నిలబెట్టి, ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దిన ఘనత మోదీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ప్రధాని మోదీ నాయకత్వ పటిమతో ప్రపంచ దేశాలతో భారత్కు స్నేహపూర్వక సంబంధాలు మెరుగయ్యాయని తెలిపారు. పాకిస్థాన్ ఉగ్రవాదులు భారత మహిళల బొట్టు తుడిచి, భర్తలను వారి కళ్ల ముందే చంపిన దుశ్చర్యకు మోదీ ప్రభుత్వం ‘ఆపరేషన్ సిందూర్’ ద్వారా గట్టిగా ప్రతీకారం తీర్చుకుందని ఆయన గుర్తుచేశారు. అనేక ప్రజా సంక్షేమ పథకాలతో దేశాన్ని అభివృద్ధి పథంలో మోడీ నడిపిస్తున్నాడని ఈటల వివరించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం పెద్దఎత్తున నిధులు కేటాయిస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేంద్రం సహకరించడం లేదని అబద్ధపు ప్రచారం చేయడం దారుణమని ఆయన విమర్శించారు.
బీజేపీ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సునీతా రెడ్డి, బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి,బిజెపి నాయకులు పిల్లి రామరాజు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లెబోయిన శ్యామ్ సుందర్, వీరెల్లి చంద్రశేఖర్, కన్మంత రెడ్డి శ్రీదేవి రెడ్డి,కంకణాల నివేదిత రెడ్డి, దోనూర్ వీరారెడ్డి బిజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతేపాక లింగస్వామి, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి పాలకూరి రవిగౌడ్, బీజేపీ రాష్ట్ర నాయకులు కర్నాటి సురేష్,లాలు నాయక్, మిరియాల వెంకటేష్, మహిళా మోర్చా రాష్ట్ర నాయకులు కొండేటి సరిత, బీజేపీ జిల్లా నాయకులు లకడ పురం వెంకటేశ్వర్లు, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు రావెల కాశమ్మ, తదితరులు పాల్గొన్నారు.