17-01-2026 07:29:13 PM
భిక్కనూరు,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంలో శుక్రవారం అనూహ్య ఘటన చోటు చేసుకుంది. సుమారు 200కు పైగా కోతులు రెండు వర్గాలుగా విడిపోయి రోడ్డుపై పరస్పరం దాడులకు దిగడంతో పట్టణం ఒక్కసారిగా గందరగోళంగా మారింది. గాంధీ చౌక్ సమీపంలో ఒక్కసారిగా పెద్దగా అరుపులు వినిపించడంతో ఏమైందో అర్థం కాక స్థానికులు భయంతో పరుగులు తీశారు. కొద్దిసేపటికే కోతుల గుంపులు ఒకదానిపై ఒకటి దాడి చేసుకుంటూ రోడ్డంతా ఆక్రమించాయి.
ఈ హంగామాతో వ్యాపారులు షాపుల షట్టర్లు మూసివేసి లోపలికి చేరుకోగా, నీటి కోసం వచ్చిన మహిళలు ఖాళీ బిందెలతోనే అక్కడి నుంచి వెనుదిరిగారు. కొందరు కోతులను వెళ్ళగొట్టే ప్రయత్నం చేసినా అవి మరింత రెచ్చిపోవడంతో ఎవరూ బయటకు రావడానికి సాహసం చేయలేకపోయారు. దాదాపు అరగంట పాటు భయానక పరిస్థితులు నెలకొనగా, అక్కడికి వీధి కుక్కలు చేరడంతో కోతులు చెల్లాచెదురుగా వెళ్లిపోయాయి. ఈ ఘటనతో భిక్కనూరు ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.