పదేళ్లు తెలంగాణ తల్లి తెరమరుగు
- తానే తెలంగాణ అన్న తరహాలో గత పాలకుల వ్యవహారం
- విగ్రహ ఏర్పాటుపై బీఆర్ఎస్కు మనసు రాలేదు
- కన్న తల్లిని తలపించేలా విగ్రహం తయారీ
- డిసెంబర్ 9న లక్షలాది మంది సమక్షంలో వేడుక
- ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి
- సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ భూమి పూజ
హైదరాబాద్, ఆగస్టు 28(విజయక్రాంతి): తమ పదేండ్ల పాలనలో ఎన్నెన్నో నిర్మించామని, ప్రపంచానికి ఆదర్శంగా నిలిచామని గొప్పలు చెప్పుకొనే పాలకులు తెలంగాణ తల్లిని తెరమరుగు చేశారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా, కన్న తల్లిని తలపించేలా విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టు వెల్లడించారు. గత పదేళ్లలో రూ.22.50 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టిన వారికి రూ.కోటి పెట్టి సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసేందుకు మనసు రాలేదని దుయ్యబట్టారు.
బుధవారం సచివాలయం ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపనకు భూమి పూజ కార్యక్రమాన్ని సీఎం నిర్వహించారు. అనంతరం రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. భూమి పూజ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించాలనుకున్నామని, వేద పండితులను సంప్రదిస్తే ఈ రోజు మినహా దసరా వరకు మంచి రోజులు లేవని చెప్పారని పేర్కొన్నారు.
అందుకే ముందుగా నిర్ణయించిన మేరకు డిప్యూటీ సీఎం కేరళ పర్యటనకు వెళ్లడం, మంత్రులు ఇతర కార్యక్రమాల్లో బిజీగా ఉండటంతో హడావుడిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాల్సి వచ్చిందని తెలిపారు. పరిపాలనకు గుండెకాయ వంటి సచివాలయ ప్రాంగణంలో డిసెంబరు 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరిస్తామని స్పష్టం చేశారు. మిలియన్ మార్చ్ తరహాలో లక్షలాది మంది తెలంగాణ బిడ్డల సమక్షంలో ఆ రోజు విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని వెల్లడించారు. కరీంనగర్లో ఇచ్చిన మాట మేరకు సోనియా గాంధీ 60 ఏళ్ల రాష్ర్ట ఆకాంక్షను నెరవేర్చారని కొనియాడారు. 2014లో తెలంగాణ ఏర్పాటు కావడం సువర్ణాక్షరాలతో లిఖించదగిన అంశమన్నారు.
జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్కు బాధ్యతలు
దేశం కోసం ఎంతో చేసిన రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే తెలంగాణ తల్లి విగ్రహంతో ముడిపెట్టి దానిని వివాదం చేసేందుకు కొందరు ప్రయత్నించారని సీఎం ఆగ్రహం వ్యక్తంచేశారు. సచివాలయం లోపల తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తామని జూన్ ౨వ తేదీనే తాను ప్రకటించానని గుర్తుచేశారు. దొరల గడీల ఆనవాళ్లు విగ్రహంలో ఉండకూడదని, తెలంగాణ ప్రజల అభిమతానికి తగినట్టు ఆ తల్లి విగ్రహం రూపొందించే బాధ్యతను తెలంగాణ బిడ్డ, జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ విభాగం కళాశాల ప్రిన్సిపల్కు అప్పగించామని వెల్లడించారు.
తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందని 2009 డిసెంబర్ 9న మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ప్రకటించిందని, అదే రోజు తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ జన్మదినం కావడంతో తెలంగాణ తల్లి విగ్రహాన్ని డిసెంబర్ 9న ఆవిష్కరిస్తామని రేవంత్ స్పష్టంచేశారు. కార్యక్రమంలో రోడ్లు భవనాలశాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు తదితరులు పాల్గొన్నారు.
ప్రగతి భవన్లోకి ప్రజలను రానివ్వలే..
తానే తెలంగాణ.. తెలంగాణే తాను అనేలా గత పాలకులు వ్యవహరించారని సీఎం విమర్శించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం అలాంటి విధానా లకు విరుద్ధమని చెప్పారు. ప్రగతి భవన్ పేరిట గడీ నిర్మించుకొని, భారీ కంచెలు ఏర్పాటు చేసుకొని వందల మంది పోలీ సు పహారా పెట్టుకొని ప్రజలను అందులోకి రాకుండా నిషేధించారని, తాము అధికారంలో వచ్చాక ప్రగతి భవన్ పేరును ప్రజాభవన్గా మార్చామని గుర్తు చేశారు.
ఇప్పుడు ఎవరైనా ప్రజా భవన్లోకి స్వేచ్ఛగా వెళ్లవచ్చని అన్నారు. రాష్ర్ట పాలనకు సంబంధించిన నిర్ణయాలన్నీ సచివాలయంలోనే జరుగుతాయ ని, ప్రజలు తమ సమస్యలను తెలుపుకొనే అవకాశం ఇక్కడే ఉందని చెప్పారు. నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్ చుట్టుపక్కల దేశం, రాష్ర్టం కోసం ఎంతో చేసిన అంబేద్కర్, ఇందిరా గాంధీ, అంజయ్య, పీవీ నరసింహారావు, కాకా వెంకటస్వామి విగ్రహాలు, జైపాల్రెడ్డి సమాధి ఉన్నాయని, వీటి మధ్య రాజీవ్ గాంధీ విగ్రహం లేని లోటుగా కనిపించిందన్నారు.
సచివాలయం ఎదుట ప్రదేశాన్ని తమ స్వార్థ ప్రయోజనాల కోసం కొందరు ఉంచుకోవాలని భావించారని, మేధావుల సూచన మేరకే తాము అక్కడ రాజీ వ్గాంధీ విగ్రహం ఏర్పాటు చేశామని రేవంత్రెడ్డి స్పష్టంచేశారు.
విపక్షాలు విమర్శలు మానుకోవాలి: మంత్రి కోమటిరెడ్డి
దేశకోసం ప్రాణాలు అర్పించిన రాజీవ్గాంధీ విగ్రహం ఏర్పాటుపై విపక్షాలు విమర్శలు మానుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సూచించారు. తెలంగా ణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియాగాంధీ పుట్టి న రోజు డిసెంబర్ 9వ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్టు వెల్లడించారు. తెలంగాణ కోసం కొట్లాడిన యువ త, విద్యార్థుల భవిష్యత్ను తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.






