ఆదివాసీల హక్కుల కోసం ఉద్యమం
- భద్రాచలం వేదికగా ఐదు రాష్ట్రాల ఐక్యగర్జన
- హక్కుల కోసం 10 తీర్మానాలు
- హాజరైన మాజీ డీజీపీ పూర్ణచంద్రరావు
హైదరాబాద్, జూలై 6 (విజయక్రాంతి): ఆదివాసుల రాజ్యాంగ హక్కుల పరిరక్షణకు దేశవ్యా ప్తంగా ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపునిస్తూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్ గఢ్, ఒడిశా, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి వచ్చిన వందలాది మంది ఆదివాసీ ప్రతినిధులు భద్రాచలంలోని హరిత ఫంక్షన్ హాల్లో నిర్వహించిన అఖిల భారత ఆదివాసీ రాజ్యాంగ హక్కులు, --సంస్కృతి పరిరక్షణ సమన్వయ కమిటీ సమావేశంలో 10 కీలక తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. సమావేశానికి కమిటీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డా. చాందా లింగయ్య దొర అధ్యక్షత వహించగా, జాతీయ కన్వీనర్, మాజీ ఎమ్మె ల్యే లక్కె రాజారావు పాల్గొన్నారు.
ముఖ్య అతిథిగా మాజీ డీజీపీ డా. జె. పూర్ణచంద్రరావు హాజ రై మాట్లాడుతూ.. రాజ్యాంగం కల్పించిన రక్షణలను ప్రభుత్వాలు సమర్థంగా అమలు చేయకపో వడం వల్ల దేశవ్యాప్తంగా ఆదివాసులు తమ భూములు, అడవులు, సహజ వనరులు, సంప్రదాయ జీవనాధారాలను కోల్పోతున్నారని ఆవే దన వ్యక్తం చేశారు. రాజ్యాంగంలోని 5 వ షెడ్యూ ల్, పేసా చట్టం, అటవీ హక్కుల చట్టంలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే పూర్తిస్థాయిలో అమ లు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
అనంతరం 10 ప్రధాన తీర్మానాలు ఆమోదించారు. 5 వ షెడ్యూల్ను సంపూర్ణంగా అమలు చేసి, పెసా చట్టం ద్వారా గ్రామసభలకు నిజమైన స్వయంపాలన కల్పించాలి. దేశ జనగణనలో ఆదివాసుల సంప్రదాయ విశ్వాసాలకు ప్రత్యేక మత కోడ్ను గుర్తించాలి. కోయితూర్ (కోయ) భాషను రా జ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్లో చేర్చాలి. జి.ఓ. ఎం.ఎస్. నెం.3ను సవరించి, షెడ్యూల్ ప్రాం తాల్లో ఆదివాసుల ఉపాధి హక్కులను రక్షించే చట్టాలను తీసుకురావాలి.
భూబదిలీ నియంత్రణ చట్టం (ఎల్టీఆర్ 1/70)ను కఠినంగా అమలు చేసి, కోనేరు రంగారావు కమిషన్ సిఫారసులను అమలు చేయాలి. అటవీ హక్కుల చట్టం--2006ను బలహీనపరిచే 2022 సవరణలను ఉపసంహరించాలి. పోలవరం, కాళేశ్వరం, బీటీపీఎస్, బొగ్గు గనులు, విద్యుత్ ప్రాజెక్టులు, ఇసుక, ఖనిజాల తవ్వకాల వల్ల నిర్వాసితులైన ఆదివాసులకు భూ మికి భూమి, సమగ్ర పునరావాసం కల్పించాలి. షెడ్యూల్ ప్రాంతాల సహజ వనరుల ద్వారా వచ్చే ఆదాయంలో స్థానిక ఆదివాసులకు న్యాయమైన వాటా కల్పించి, ఆ నిధులను స్థానిక అభివృద్ధికి వినియోగించాలి. ఇసుక, గనులు, పోలవరం, బీటీపీఎస్ తదితర ప్రాజెక్టుల్లో జరిగిన అక్రమాలపై స్వతంత్ర సీబీఐ దర్యాప్తు, శ్వేతపత్రం, ప్రత్యేక ఆడిట్ నిర్వహించాలి.
5 వ షెడ్యూల్ ప్రాంతాల భౌగోళిక దూరం, వెనుకబాటుతనాన్ని పరిగణనలోకి తీసుకొని ఆదివాసులకు రాజకీయ ప్రాతిని ధ్యాన్ని గణనీయంగా పెంచేలా రాజ్యాంగ సవరణలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. సమావేశంలో ఆంధ్రప్రదేశ్ నుంచి మాజీ ఎమ్మెల్యేలు లక్కె రాజారావు, కె. లక్ష్మణమూర్తి, ఛత్తీస్ గఢ్ నుంచి మాజీ ఎమ్మెల్యే మనీష్ కింజల్, మాజీ మంత్రి కవాసి లఖ్మా, ఒడిశా నుంచి మాజీ ఎమ్మెల్యే మనస్ మడ్కి, మహారాష్ట్ర నుంచి మాజీ మేయర్ మరాపా బాబూరావు, కుమ్రే పాండురంగం, సువర్ణ వాడ్కరే తదితరులు పాల్గొన్నారు.






