27-05-2025 06:11:57 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): ఐటీ కారిడార్ లో ట్రాఫిక్ కష్టాలు త్వరలో తీరనున్నాయి. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి కొండాపూర్ పైవంతెన ప్రారంభానికి రంగం సిద్ధమైంది. రూ.178 కోట్లతో 1.2 కిలోమీటర్ల పొడవు, 24 మీటర్ల వెడల్పుతో ఆరు లైన్లతో నిర్మించిన మల్టీ లెవల్ ఫ్లైఓవర్ ను జూన్ తొలివారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ మల్టీ లెవల్ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే గచ్చిబౌలి వద్ద ట్రాఫిక్ రద్దీ తగ్గనుంది. ఓఆర్ఆర్ నుంచి కొండాపూర్ కు వెళ్లే అత్యాధునిక మల్టీ లెవల్ ఫ్లైఓవర్ నిర్మాణం దాదాపుగా పూర్తైపోయింది. ఇప్పటికే ఉన్న రెండు ఫ్లై ఓవర్లపై నిర్మించిన మూడో స్థాయి నిర్మాణం. కింద గచ్చిబౌలి జంక్షన్ ఫ్లై ఓవర్, దానిపై శిల్పా లేఅవుట్ ఫేజ్-1 ఫ్లై ఓవర్ ఉండగా, ఇప్పడు దానికి పైన ఫేజ్-2 ఫ్లై ఓవర్ నిర్మించారు. దీంతో గచ్చిబౌలి జంక్షన్ వద్ద ట్రాఫిక్ రద్దీ ఈ ఫ్లై ఓవర్ చాలా వరకు తగ్తనుంది.