07-02-2026 12:00:00 AM
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని
నిజామాబాద్, ఫిబ్రవరి 6(విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికలలో ఓటర్లను ఎలాంటి ప్రలోభాలకు గురి చేయకుండా, ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని సూచించారు. హైదరాబాద్ నుండి మున్సిపల్ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ శుక్రవారం ఉమ్మడి నల్గొండ, నిజామాబాద్ జిల్లాల జనరల్ అబ్జర్వర్లు, కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని మాట్లాడుతూ, ఎన్నికలను నిష్పక్షపాతంగా, పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని, ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా చూడాలన్నారు. ఈ సందర్భంగా ఆమె వివిధ అంశాలపై జిల్లా కలెక్టర్లకు సూచనలను చేశారు. ఎన్నికల సందర్భంగా అక్రమ మద్యం, డబ్బు, ప్రలోభాలకు గురి చేసే సామాగ్రిని ఎప్పటికప్పుడు ఎఫ్.ఎస్.టి, ఎస్.ఎస్.టి బృందాలు నిరంతరం నిఘా ఉంచాలని, అలాగే అంతరరాష్ట్ర సరిహద్దుల్లో చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేయాలని, రౌడీ షీట్ నమోదైన వారిపై పోలింగ్ రోజున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా షాడో టీమ్ నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ, నిజామాబాద్ తో పాటు ఇంచార్జ్ జిల్లా ఎన్నికల అధికారి హోదాలో కామారెడ్డి జిల్లాలో కూడా మున్సిపల్ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అవసరమైన ఎన్ని చర్యలు తీసుకున్నామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ దృష్టికి తెచ్చారు. వీ.సీ అనంతరం కలెక్టర్ ఇలా త్రిపాఠి నగర పాలక సంస్థ పరిధిలో ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న ఉద్యోగుల కోసం కలెక్టరేట్ లో పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కోసం చేసిన ఏర్పాట్లను, ఫెసిలిటేషన్ సెంటర్ ను నిశితంగా పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ఎన్నికల సాధారణ పరిశీలకులు సీహెచ్.సత్యనారాయణ రెడ్డి, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.