31-05-2025 04:58:17 PM
కమిషనర్ హామీతో విరమణ..
మహబూబాబాద్ (విజయక్రాంతి): పెండింగ్ లో ఉన్న ఐదు నెలల వేతనాన్ని ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శనివారం తెల్లవారుజామున మహబూబాబాద్ మున్సిపల్ కార్మికులు(Mahabubabad Municipal Workers) విధులు బహిష్కరించి నిరసనకు దిగారు. ఈ విషయం తెలుసుకున్న శానిటేషన్ ఇన్స్పెక్టర్ కర్ణాకర్(Sanitation Inspector Karnakar) అక్కడికి చేరుకొని మున్సిపల్ కమిషనర్ కు సమాచారం అందించి, సిఐటియు యూనియన్ నాయకులతో మాట్లాడి బుధవారంలోగా పెండింగ్ వేతనాలు చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించి కార్మికులు పారిశుద్ధ్య పనులను చేపట్టారు.
ఈ సందర్భంగా సిఐటియు పట్టణ కార్యదర్శి కుమ్మరి కుంట్ల నాగన్న, మున్సిపల్ యూనియన్ జిల్లా కార్యదర్శి కాంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ... ప్రతిరోజు పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తూ, ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం కృషి చేస్తున్న చిరు ఉద్యోగుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి సరైంది కాదన్నారు. ప్రతినెలా క్రమం తప్పకుండా వేతనం చెల్లించడంతోపాటు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, పిఎఫ్, ఈఎస్ఐ ఇతర సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆవుల వీరన్న, చిరంజీవి, పార్నంది కృష్ణ, పుచ్చకాయల ఎల్లయ్య, మంజుల, చెడుపాక అర్చన, అచ్చమ్మ, సుజాత, కళ్యాణి, శ్రీధర్, హరిబాబు, జయసుధ, కిరణ్, సునీత, వేణు పాల్గొన్నారు.