గుర్తు తెలియని వ్యక్తి హత్య?
వనస్థలిపురం పరిధిలోని పనామా గోదాం సమీపంలో ఘటన
ఎల్బీనగర్, జూలై 12 : గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. మృతదేహంపై రక్తపు మరకలు ఉండడంతో పోలీసులు హత్యగా అనుమానిస్తూ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే... గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన పనామా గోదామ్ సమీపంలో ఉన్న ఏఆర్ టీ థియేటర్ ఎదురుగా, ఎస్ఎస్పీ వీల్ కేర్ షెల్టర్ పక్కన జరిగింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో వనస్థలిపురం పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అప్పటికే అతను మృతి చెందినట్లు నిర్ధారించారు.
మృతుడి వయస్సు 50 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉండగా, 5.5 అడుగుల ఎత్తు, చామనచాయ రంగు, తెల్లటి గడ్డం కలిగి ఉన్నాడని పోలీసులు తెలిపారు. మృతుడి తల వెనుక భాగంలో రక్తస్రావంతో కూడిన గాయం ఉన్నట్లు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, మృతుడి గుర్తింపు కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ వ్యక్తి వివరాలు ఎవరికైనా తెలిసినట్లయితే వెంటనే వనస్థలిపురం పోలీస్ స్టేషన్ నంబర్లు: 8712662280, 8712662300, 8712662637 లను సంప్రదించాలని పోలీసులు సూచించారు.






