29-05-2025 12:00:00 AM
పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న తాజాచిత్రం ‘హరిహరవీరమల్లు’. ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఏ దయాకర్రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.
కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో బాబి డియోల్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. జూన్ 12న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, మూడు గీతాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి మరో గీతం ‘తార తార’ విడుదలైంది.
చెన్నైలో ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో చిత్ర సంగీత దర్శకుడు కీరవాణి, డైరెక్టర్ జ్యోతికృష్ణ, హీరోయిన్ నిధి అగర్వాల్తోపాటు దర్శకుడు కేఎస్ రవికుమార్, నటులు నాజర్, సత్యరాజ్, ఇతర చిత్రబృందం పాల్గొన్నారు. ‘హే తార తార నా కళ్లు.. వెన్నెలపూత నా ఒళ్లు..’ అంటూ సాగుతున్న ఈ పాటలో పవన్కల్యాణ్, నిధి అగర్వాల్ జోడీ ఇంపుగా ఉంది.
కీరవాణి కూర్చిన బాణీకి శ్రీహర్ష తన సాహిత్యంతో మరింత అందం తీసుకొచ్చారు. లిప్సిక భాష్యం, ఆదిత్య అయ్యంగార్ ఈ గీతాన్ని ఆలపించిన తీరు సంగీత ప్రియులను కట్టిపడేస్తుంది. ఈ చిత్రానికి డీవోపీ: మనోజ్ పరమహంస; జ్ఞానశేఖర్ వీఎస్; సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి, చంద్రబోస్, పెంచల్ దాస్; ఆర్ట్: తోట తరణి; ఎడిటర్: ప్రవీణ్ కేఎల్.