22-09-2025 03:09:08 PM
కొత్తపల్లి (విజయక్రాంతి): సంఘ వికాసంతోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని ఆర్ఎస్ఎస్ విభాగ్ సహసంఘచాలక్ డాక్టర్ చక్రవర్తుల రమణాచారి అన్నారు. కరీంనగర్లోని స్థానిక శిశు మందిర్ లో వారం రోజులపాటు జరుగుతున్న శిక్షావర్గ ప్రారంభ ఉపన్యాస కార్యక్రమంలో డాక్టర్ రమణాచారి మాట్లాడుతూ, దేశాన్ని మాతృభూమిగా ప్రేమించే స్వయంసేవకులలో అనుశాసనం, దేశభక్తి, సేవాభావం వంటి గుణాల నిర్మాణం ఆర్ఎస్ఎస్ శాఖలో నిర్మాణం జరుగుతుందని వివరించారు.
1925 నుండి సంఘ శాఖల ద్వారా వ్యక్తి నిర్మాణము జరుగుతుందని, శరీరంలోని ప్రతి కణం శరీర ధారుఢ్యానికి ఏ విధంగా పనిచేస్తాయో, దేశంలోని సామాన్య వ్యక్తులు కూడా దేశ అభివృద్ధిలో పాలుపంచుకోవాలని అన్నారు. భారతదేశ పరమ వైభవం ద్వారానే విశ్వ కళ్యాణం, విశ్వశాంతి సాధ్యపడుతుందని చెప్పారు. శిక్షణకు వచ్చిన స్వయంసేవకులు గ్రామీణ క్షేత్రాలలో సంఘ శాఖల నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ విభాగ్ కార్యవాహ సత్యనారాయణ, మల్లోజుల కిషన్ రావు, శిక్షణకు వచ్చిన స్వయం సేవకులు, తదితరులు పాల్గొన్నారు.