త్వరలో కొత్త ఆరోగ్యం విధానం
- మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడి
- నాణ్యమైన వైద్యసేవలకు చర్యలు
- ‘ఉస్మానియా’లో పలు సేవలకు శ్రీకారం
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 21 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఆరోగ్య విధానంపై త్వరలో కీలక నిర్ణయం తీసుకోబోతున్నామని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. పేదలకు నాణ్యమైన వైద్యసేవలు అందించనున్నట్లు తెలిపారు. ఉస్మానియా ఆస్పత్రిలో రూ.13.97కోట్ల విలువైన కొత్త 1.5 టెస్లా ఎంఆర్ఐ, రూ.34.39 లక్షలతో పునరుద్ధరించిన నూతన ఓపీని, రూ.1.6కోట్లతో నిర్మించిన డైట్ కిచెన్ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వైద్య, విద్యావ్యవస్థ బలోపేతంపై దృష్టి సారించామని, రూ. 5లక్షల నుంచి 10లక్షలకు పెంచిన ఆరోగ్యశ్రీ సేవలు అందు లో భాగమేనని పేర్కొన్నారు.
గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా ఆరోగ్య పథకాల్లోని లోపాలను పూరిం చి వాటి బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు. ఉస్మానియా ఆస్పత్రితో పాటు జీఎన్ఎం విభాగానికి కొత్త భవనాల నిర్మాణానికి మంత్రి హామీ ఇచ్చారు. వైద్యులు, సిబ్బంది, మౌలిక సౌకర్యాలు కొరత ఉన్నప్పటికీ అందిస్తున్న వైద్య సేవల పట్ల వైద్యులను అభినందించారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు అనిల్కుమార్యాదవ్, ఎమ్మెల్సీలు ఎం.ఎస్ ప్రభాకర్రావు, మీర్జా రహ్మత్బేగ్, సురభివాణి, ఎమ్మెల్యే రాజాసింగ్, కార్పొరేటర్ శంకర్యాదవ్, రాష్ట్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి డా.క్రిస్టినాజెడ్చొంగ్తూ, డైరెక్టర్ కర్ణన్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, ఆస్పత్రి సూపరింటెండెంట్, తదితరులు పాల్గొన్నారు.






