10 August, 2026 | 5:01 AM

భోనమెత్తిన నిర్మల్..

10-08-2026 12:00 AM

నిర్మల్ ఆగస్టు 8 ( విజయ క్రాంతి)ఆషాఢ మాస బోనాల పర్వదినం సందర్భంగా నిర్మల్ జిల్లా కేంద్రం ఆదివారం భక్తిశ్రద్ధలతో పులకించింది. పట్టణంలోని పురాతన బంగల్ పేట్ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంతో పాటు మారెమ్మ, పోచమ్మ దేవాలయాలకు ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. బంగల్ పేట్ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి విగ్రహానికి పంచామృతాలు, గంగాజలంతో అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు.

అనంతరం అమ్మవారిని దర్శించుకునేందుకు నిర్మల్ పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు బారులు తీరారు. మహిళలు బాజా భజంత్రీల నడుమ బోనాలతో ఊరేగింపుగా ఆలయాలకు చేరుకుని అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. తమ పిల్లాపాపలను చల్లంగా చూడాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని అమ్మవారిని వేడుకున్నారు. బోనాల ఊరేగింపులు, అమ్మవారి నామస్మరణలతో పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేయగా, పోలీసులు బందోబస్తు నిర్వహించారు.