10-02-2026 01:16:19 AM
ప్రతి ఇంటికి ఉచిత వైద్యం
పాత పాల్వంచలో శ్మశాన వాటిక ఏర్పాటుకు కృషి
పాల్వంచ, ఫిబ్రవరి౯ (విజయక్రాంతి): కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పాల్వంచ డివిజన్ 46 డివిజన్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలుగుదేశం బలపరిచిన సీపీఐ అభ్యర్థి ఎండీ జిలాని బేగం అన్నారు. ఎన్నికల ప్రచారంలో చివరి రోజు సోమవారం డివిజన్లో విస్తృతంగా పర్యటించి ప్రచారం నిర్వహించారు.తన భర్త ఆర్ఎంపీ మస్తాన్ గత 20 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో వైద్య సేవలు అందిస్తూ వస్తున్నారని, ఈ ప్రాంత సమస్యలపై పూర్తిగా అవగాహన కలిగి ఉన్నమన్నారు.
ఈనెల 11న జరిగే ఎన్నికల్లో కంకి కొడవలి గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. పాత పాల్వంచలో శ్మశాన వాటిక ఏర్పాటుకు కృషి చేస్తానని, ప్రతి ఇంట్లో ఉచిత వైద్యం అందిస్తామని, మౌలిక సదుపాయాల కల్పనకు స్థానిక ఎమ్మెల్యే సాంబ శివరావు సహకారంతో నిధులు సమకూరుస్తామని హామీ ఇచ్చారు. తమ అమూల్యమైన ఓటును కంకి కొడవలి గుర్తుపై వేసి కార్పొరేటర్గా గెలిపించాలని వేడుకున్నారు. ప్రచారంలో ఆమె వెంట ఆర్ఎంపీ మస్తాన్, కరీం, వెంకటలక్ష్మి, దుర్గ తదితరులు పాల్గొన్నారు.