విష పదార్థాలు ప్రయోగించలేదు
పౌరహక్కుల సంఘం ఆరోపణలను ఖండించిన డీజీపీ జితేందర్
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 2 (విజయక్రాంతి): ములుగు జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో విష పదార్థాలు ప్రయోగించి, స్పృహ కోల్పోయాక కాల్పులు జరిపారని పౌర హక్కుల సంఘం చేస్తున్న ఆరోపణలను డీజీపీ జితేందర్ ఖండించారు. ఇది పూర్తిగా దుష్ప్రచారమని స్పష్టం చేశారు. ఈ మేరకు డీజీపీ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
కొన్నిరోజుల ముందు ఇన్ఫార్మర్ల నెపంతో ఇద్దరు ఆదివాసీల(రమేశ్, ఉయిక అర్జున్)ను మావోయిస్టులు దారుణంగా హత్య చేశారని తెలిపారు. ఇలాంటి ఘటనలు జరగకుండా పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులపై మావోయిస్టులు అత్యాధునిక ఆయుధాలతో కాల్పులు జరిపారని పేర్కొన్నారు.
ఈక్రమంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు సాయుధ మావోయిస్టులు మరణించారన్నారు. హైకోర్టు, జాతీయ మానవహక్కుల సంఘం(ఎన్హెచ్ఆర్సీ) సూచనల మేరకు మావోయిస్టుల మృతదేహాలకు శవపరీక్షలు జరుగుతున్నాయని తెలిపారు. కేసు దర్యాప్తు అధికారిగా మరో జిల్లా డీఎస్పీని నియమించామని డీజీపీ వివరించారు.






