27-11-2025 12:45:04 PM
అన్నారం గ్రామపంచాయతీ గెలుపు మాదే అంటున్న నాయకులు
తుంగతుర్తి,(విజయక్రాంతి): తుంగతుర్తి మండల వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల( local body elections) సందడి మొదలైంది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి అధికారికంగా నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద అభ్యర్థులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులు పెద్ద సంఖ్యలో చేరడంతో ఆ ప్రాంతాలు పండుగ వాతావరణం తలపించింది. పలువురు అభ్యర్థులు మొదటి రోజునే నామినేషన్లు దాఖలు చేశారు. రాబోయే రెండు రోజుల్లో ఇది మరింత ఉత్సాహంగా సాగనుందని అధికారులు అంచనా వేశారు.
ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు, నియమావళి ప్రకారం నామినేషన్లను స్వీకరిస్తున్నామని ఎంపీడీవో శేష్ కుమార్ తెలిపారు. అభ్యర్థులు అవసరమైన పత్రాలు, అఫిడవిట్, ఫీజులు పూర్తి చేసి సమర్పించాలని, సూచించారు.ఎన్నికలలో నిష్పక్షపాతమైన వాతావరణం ఉండేలా పోలీసు అధికారులు భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు.ఈ ఎన్నికల్లో ప్రతి ఓటు విలువైనదని, ప్రజాస్వామ్యంలోఓటుహక్కువినియోగించుకోవాలని అధికారులు, స్థానిక నాయకులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అనంతరం స్థానిక దాసుల దయానందం వివిధ గ్రామపంచాయతీలో సర్పంచ్ దరఖాస్తులు పరిశీలించారు. అన్నారం గ్రామపంచాయతీలో సర్పంచ్ బిఆర్ఎస్ అభ్యర్థి కుంచాల శ్రీనివాస్ రెడ్డి బిఆర్ఎస్ నాయకులతో కలిసి దరఖాస్తు అందజేస్తూ, అన్నారంలో బిఆర్ఎస్ విజయ డంక మోగిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.