10 March, 2026 | 9:50 AM

ఢిల్లీ లిక్కర్ కేసులో మళ్లీ నోటీసులు

10-03-2026 02:17 AM

కవిత, కేజ్రీవాల్ సహా 23 మందికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు 

రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేసిన సీబీఐ

మార్చి 16 నాటికి విచారణ వాయిదా వేసిన ఉన్నత న్యాయస్థానం

న్యూఢిల్లీ, మార్చి 9: దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ మళ్లీ కీలక మలుపు తిరిగింది.  కేజ్రీవాల్, కవిత, మనీశ్ సిసోడియా సహా మొత్తం 23 మందికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 27న రౌస్ అవెన్యూ కోర్టు అరవింద్ కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా, కల్వకుంట్ల కవిత సహా మొత్తం 23 మందిని ఈ కేసు నుంచి విముక్తి చేస్తూ తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో కోర్టు తీర్పును ఢిల్లీ హైకోర్టులో సీబీఐ సవాల్ చేసింది. ఈ క్రమంలో సీబీఐ పిటిషన్‌పై సోమవారం హైకోర్టు విచారణ జరిపింది. కోర్టు, ప్రతివాదులకు నోటీసులు జారీ చేసూ సమాధానాలు కోరింది. తదుపరి విచారణను మార్చి 16వ తేదీకి వాయిదా వేసింది. సీబీఐ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మోహతా వాదనలు వినిపించారు. ఇందులో భాగంగా ధర్మాసనం కేజ్రీవాల్, కవిత, సిసోడియాతో పాటు మిగిలిన నిందితులందరికీ నోటీసులు జారీ చేసింది. సీబీఐ దాఖలు చేసిన ఈ రివిజన్ పిటిషన్‌పై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

విచారణ సందర్భంగా సీబీఐ తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ విచారణాధికారిపై కోర్టు చేసిన వ్యాఖ్యలు దర్యాప్తు సంస్థల మనోధైర్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన హైకోర్టు, దర్యాప్తు సంస్థ, విచారణాధికారిపై ట్రయల్ కోర్టు చేసిన ప్రతికూల వ్యాఖ్యలపై స్టే విధిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.అంతేకాకుండా, సీబీఐ కేసులో నిందితులు విడుదలయ్యారు కాబట్టి ఈడీ దాఖలు చేసిన మనీ లాండరింగ్ కేసు విచారణను కూడా నిలిపివేయాలని నిందితుల తరపు న్యాయవాదులు కోరగా.. హైకోర్టు భిన్నంగా స్పందించింది. సీబీఐ రివిజన్ పిటిషన్‌పై నిర్ణయం తీసుకునే వరకు మనీ లాండరింగ్ కేసు విచారణను వాయిదా వేయాలని ట్రయల్ కోర్టుకు సూచించింది. తదుపరి విచారణను వచ్చే మార్చి 16కి వాయిదా వేసింది.