28-05-2025 06:14:35 PM
ఇల్లెందు టౌన్ (విజయక్రాంతి): యుగపురుషుడు, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, తెలుగు వారి ఆరాధ్య దైవం, తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు అని తెలుగు దేశం పార్టీ ఇల్లందు నియోజకవర్గ కన్వీనర్ ముద్రగడ వంశీ(Convener Mudragada Vamsi) పేర్కొన్నారు. బుధవారం ఎన్టీఆర్ 102వ జయంతి సందర్భంగా స్థానిక బుగ్గవాగు దగ్గర ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద ప్రజలకు కూడు, గూడు, గుడ్డ అనే మూడు అవసరాలను తీర్చడమే తన జీవితాశయంగా భావించిన ధీరోదాత్తుడు అన్న ఎన్టీఆర్ అని అన్నారు.
సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో ప్రజాస్వామ్యానికి కొత్త అర్ధం చెప్పిన దార్శనికుడు అని కొనియాడారు. అన్నగా ఆడబిడ్డలకు ఆస్తి, మండల వ్యవస్థతో ప్రజల వద్దకు పాలన, పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణం, కిలో రెండు రూపాయలకే బియ్యం అందించి తెలుగు ప్రజల్లో చిరస్థాయిగా నిలిచారన్నారు. నా తెలుగు జాతి సగౌరవంగా తలెత్తుకు నిలబడాలి అనే సంకల్పమే ఎన్టీఆర్ ది అన్నారు. చరిత్రలో స్థానం సంపాదించుకోవడం కాదు, చరిత్రనే సృష్టించిన చిరస్మరణీయుడు ఎన్టీఆర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్ష కార్యదర్శులు పాలముల బాలకృష్ణ, దేశవ శ్రీహరి, సీనియర్ నాయకులు శాంతి, కారు నరసన్న, అయ్యోరి నాగరాజు, సల్మాన్ రాజ్, దగ్గుల లింగయ్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు.