calender_icon.png 23 June, 2025 | 5:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అణుకేంద్రాలే లక్ష్యం

23-06-2025 12:56:57 AM

ఇరాన్‌పై  ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ పేరుతో అమెరికా దాడి

బీ స్పిరిట్ బాంబుల ప్రయోగం

- బంకర్‌లో తలదాచుకున్న ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ

- అమెరికా దాడి చరిత్రాత్మకమన్న ఇజ్రాయెల్

- ఇరాన్ అధ్యక్షుడికి ఫోన్ చేసిన భారత ప్రధాని మోదీ

- అమెరికా దాడులను ఖండించిన ప్రపంచ దేశాలు

న్యూఢిల్లీ, జూన్ 22: ఆపరేషన్ మిడ్‌నైట్ హ్యామర్ పేరుతో ఇరాన్‌పై అగ్రరాజ్యం అమెరికా మెరుపుదాడులకు దిగింది. బీ స్పిరిట్ బాంబర్లతో ఫోర్డో, నతాంజ్, ఇస్ఫాహన్ అణుకేంద్రాలపై భారీ దాడులు చేసింది. ఇరాన్‌పై దాడులు చేసినట్టు స్వయానా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడం గమనార్హం. ఇజ్రాయెల్ సైన్యంతో కలిసి ఇరా న్ అణుకేంద్రాలపై దాడులు చేసినట్టు ఆయన ప్రకటించారు. అమెరికా నిర్ణయాన్ని ఇజ్రాయెల్ స్వాగతించింది.

చరిత్ర ను మార్చే నిర్ణయాన్ని అమెరికా తీసుకుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ట్రంప్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇరాన్ విదేశాంగశాఖ మంత్రి అబ్బాస్ అరఘ్చి అమెరికా తీరును తీవ్రంగా ఖండించారు. అమెరికాకు తప్పకుండా మానని గాయం చేస్తామని హెచ్చరించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని పాకిస్థాన్ ప్రతిపాదించిన మర్నాడే అమెరికా ఇరాన్‌పై దాడులకు దిగింది.

ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్‌తో భారత ప్రధాని మోదీ ఫోన్ కాల్‌లో సంభాషించారు. ఇజ్రాయెల్ చేసిన దాడుల వల్ల ఇరాన్‌లో దాదాపు 900 మంది మరణించగా.. 3,396 మంది క్షతగాత్రులయ్యారు. ఆపరేషన్ ట్రూ ప్రామిస్ దాడుల వల్ల ఇజ్రాయెల్‌లో కూడా మృతుల సంఖ్య 35 దాటింది. వందల సంఖ్యలో పౌరులు గాయపడ్డారు. ఇరాన్‌పై అమెరికా దాడి చేయడాన్ని ప్రపంచ దేశాలు తప్పుబట్టాయి. 

మిడ్ నైట్ హ్యామర్ పేరిట

వారం రోజుల నుంచి నిశ్శబ్దంగా ఉంటూ వస్తున్న అమెరికా ఒక్కసారిగా విరుచుకుపడింది. ఇజ్రాయెల్ దాడుల విషయంలో రెండు వారాల్లో నిర్ణయం తీసుకుంటానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన రెండు రోజులకే ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ పేరిట ఇరాన్‌లోని మూడు అణుకేంద్రాలపై అగ్రరాజ్యం విరుచుకుపడింది. బీ స్పిరిట్ బాంబర్లతో ఇరాన్‌లోని ఫోర్డో, నతాంజ్, ఇస్ఫాహన్ అణుకేంద్రాలను నాశనం చేసింది.

అమెరికా దాడులపై ఇరాన్ విదేశాంగశాఖ మంత్రి అబ్బాస్ అరఘ్చి స్పందించారు. అమెరికా తన చర్యలతో అంతర్జాతీయ చట్టాలను, అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆరోపించారు. తమపై దాడులకు తప్పకుండా బదులిస్తామని, అమెరికాకు శాశ్వత గాయం చేస్తామని హెచ్చరించారు. ‘రష్యా అధ్యక్షుడితో సమావేశం అయి పరిస్థితిని వివరించేందుకు మాస్కోకు వెళ్తున్నా. పుతిన్‌తో చర్చించిన అనంతరం తగిన నిర్ణయం తీసుకుంటాం.’ అని మీడియాతో తెలిపారు. 

ఫోర్డో నాశనమైంది: ట్రంప్

అమెరికా ఇరాన్‌పై దాడులు చేసినట్టు స్వయానా అమెరికా అధ్యక్షుడే ప్రకటించారు. ‘భారీ బాంబుల్ని ఫోర్డోపై వేశాం. ఇరాన్ గగనతంలోకి వెళ్లకుండానే ఈ దాడులు జరిపాం. మన విమానాలు సురక్షితంగా తిరుగుముఖం పట్టాయి. అమెరికా యోధులకు అభినందనలు. ప్రపంచంలో మరే మిలటరీకి ఇది సాధ్యం కాదు. ఇప్పుడు శాంతికి సమయం.’ అని తన సొంత సోషల్ మీడియా ట్రూత్‌లో పోస్ట్ చేశారు. “ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ ప్రకారం ఫోర్డో నాశనమైంది” అని కొద్ది సేపటికే మరో పోస్టులో పేర్కొన్నారు. 

రెండువారాలని చెప్పి.. 

ఇజ్రాయెల్ యుద్ధంలో సహకారంపై చర్చలు జరిపి రెండు వారాల్లో నిర్ణయం తీసుకుంటానని ట్రంప్ ఇటీవల ప్రకటించారు. అప్పటి వరకు ఈ విషయం గురించి ప్రస్తావించనని కూడా పేర్కొన్నారు. అలా ప్రకటించిన తర్వాత రెండు రోజులకే ఇరాన్‌పై బాంబులతో విరుచుకుపడ్డారు.

ఈ దాడికి ప్రతిగా తాము ఎర్రసముద్రంలోని అమెరికా నౌకలను లక్ష్యంగా చేసుకుంటామని హౌతీలు ప్రకటించారు. ఇరాన్ గగనతల నిబంధనలను ఉల్లంఘించి అమెరికా నేరం చేసిందని, అమెరికా అధ్యక్షుడు మొదలు పెడితే తాము అంతం చేస్తామని ఇరాన్ అధికారిక మీడియా అగ్రరాజ్యాన్ని హెచ్చరించింది.

పశ్చిమాసియాలో ఉన్న అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటామని పేర్కొంది. సామాన్య పౌరులు, సైనిక సిబ్బందిని అగ్రరాజ్యం లక్ష్యంగా చేసుకుందని ఆరోపించింది. మరోవైపు తమకు అగ్రరాజ్యం సహకరించకపోయినా దాడులు కొనసాగిస్తామని ప్రకటించి ఇజ్రాయెల్ కూడా ప్రపంచాన్ని ఏమార్చింది.

ఈ రెండు దేశాలు చేసిన ప్రకటనలతో ఇప్పట్లో అమెరికా దాడులు చేయదులే అని అనుకున్న ఇరాన్‌కు మిడ్‌నైట్ హ్యామర్ పేర అమెరికా చేసిన దాడులతో షాక్ తగిలింది. దాడుల అనంతరం తాము కూడా సమన్వయంతో అమెరికా దాడులకు సహకరించామని ఇజ్రాయెల్ ప్రకటించి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. 

అత్యంత సురక్షిత స్థలంలో ఖమేనీ

ఇరాన్ సుప్రీం లీడర్ అయాతొల్లా ఖమేనీ అత్యంత సురక్షితమైన స్థలంలో తలదాచుకున్నారు. ఇజ్రాయెల్ మాత్రమే కాకుండా అమెరికా కూడా ఇరాన్‌పై దాడులు చేయడంతో ఆ దేశం ఉక్కిరిబిక్కిరవుతోంది. ఖమేనీ ఉన్న బంకర్లో ఎటువంటి సిగ్నల్స్ రావని.. ఆయన ఉన్న ప్రదేశం ఎవరికీ తెలియకుండా ఉండేందుకు ఇలా చేసినట్టు ఇరాన్ మీడియా వెల్లడించింది. ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరిట దాడులు చేస్తున్న ఇరాన్ ఇప్పటికే ఖమేనీని లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడులు జరిపింది. అయినా ఖమేనీ మాత్రం ప్రాణాలతోనే ఉన్నారు. 

ఇరాన్ ముందే మేల్కొందా? 

అమెరికా బాంబులతో ఫోర్డో అణు కేంద్రంపై దాడులు చేసిన విషయం తెలిసిందే. అయితే అమెరికా దాడులను ముందే పసిగట్టిన ఇరాన్ అణుకేంద్రంలో ఉన్న యురేనియాన్ని ముందే బయటకు తరలించినట్టు పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అందుకు మరింత బలం చేకూరుస్తూ ఉపగ్రహ చిత్రాలు కూడా విడుదలయ్యాయి.

ఈ చిత్రాల్లో జూన్ 19,20 తేదీల్లో రాత్రిపూట అణుకేంద్రం ముందు భారీగా వాహనాలు బారులు తీరి కనిపించాయి. ఈ అణుశుద్ధీకరణ కేంద్రం టెహ్రాన్ నుంచి 100 కిలోమీటర్ల దూరంలో పర్వతానికి అడుగుభాగంలో ఉంటుంది. వైమానిక దాడులను కూడా తట్టుకునేలా దీనిని నిర్మించారు. ఈ కేంద్రం నిర్మాణం 2007లోనే మొదలైనా.. అమెరికా దాని మిత్రదేశాలకు 2009 వరకు ఈ కేంద్రం గురించి తెలియకపోవడం గమనార్హం. ఇక్కడ పౌర, సైనిక అవసరాల కోసం యురేనియం శుద్ధి చేస్తున్నారు. 

చర్చంతా తోమహక్ క్షిపణి గురించే 

ఇరాన్ మీద అమెరికా ప్రయోగించిన తోమహక్ క్షిపణి గురించి అంతటా చర్చ జరుగుతోంది. ఎప్పుడు యుద్ధంలో పాల్గొనాల్సి వచ్చినా అమెరికా ఈ క్షిపణినే ఎక్కువగా నమ్ముకుంటూ వస్తోంది. ఈ క్షిపణిని సముద్రంలో నౌకలు, జలాంతర్గాముల నుంచి శత్రు స్థావరాలపైకి ప్రయోగించొచ్చు. ఈ క్షిపణిని అగ్రరాజ్యానికి చెందిన జనరల్ డైనమిక్స్ అభివృద్ధి చేయగా.. 1983 నాటికి అగ్రరాజ్యం సైన్యం చేతిలోకి వచ్చింది. 

ట్రంప్ మరో యుద్ధానికి తెరలేపారు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరుపై రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ దిమిత్రి మెద్వదేవ్ పలు ఆరోపణలను గుప్పించారు. ట్రంప్ మధ్యప్రాచ్యంలో మరో యుద్ధాన్ని కోరుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇరాన్‌కు అణ్వాయుధాలను సరఫరా చేసేందుకు చాలా దేశాలు సిద్ధంగా ఉన్నాయి.

శాంతిదూతగా చెప్పుకుంటూ అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ యుద్ధానికి కారణం అవుతున్నారు. ఇజ్రాయెల్ దాడులతోనే ఇరాన్ ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. ఇప్పుడు అమెరికా దాడులు కూడా తోడవడంతో వారంతా ఏం చేయాలో తెలియక తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.’ అని పేర్కొన్నారు. 

మాట మార్చిన హెజ్‌బొల్లా.. 

అవసరం అయితే ఇరాన్‌కు మద్దతుగా ఏదేశం మీదైనా దాడి చేస్తామని ఇన్ని రోజులు ప్రకటిస్తూ వచ్చిన లెబనాన్ ఉగ్రవాద సంస్థ హెజ్‌బొల్లా తాజాగా మాటమార్చింది. ఇరాన్‌పై విరుచుకుపడుతున్న అమెరికా, ఇజ్రాయెల్‌పై ఎట్టి పరిస్థితుల్లో దాడులు చేయబోమని హెజ్‌బొల్లా అధికార ప్రతినిధి మీడియాకు తెలిపారు. ‘అమెరికా, ఇజ్రాయెల్ కలిసి దాడులు చేసినా కానీ ఇరాన్ తనను తాను రక్షించుకోగలదు. కాల్పుల విరమణ ఒప్పందానికి హెజ్‌బొల్లా కట్టుబడి ఉంది. ఇజ్రాయెల్ దాడులు చేసేంత వరకూ ఆ దేశ భూభాగంపై ఎటువంటి దాడులు చేయం.’ అని హెజ్‌బొల్లా పేర్కొంది. 

అమెరికా తీరు హేయనీయం

ఇరాన్‌పై అగ్రరాజ్యం అమెరికా దాడులు చేయడాన్ని అనేక దేశాలు ఖండించాయి. దాయాది పాకిస్థాన్, చైనా, రష్యా, ఈజిప్ట్, తుర్కియే, ఐక్యరాజ్య సమితితో పాటు అనేక దేశాలు అమెరికా తీరును తప్పుబట్టాయి. దాడులతో అతలాకుతలం అవుతున్న ఇరాన్‌కు సంఘీభావం ప్రకటించాయి. ఇరాన్ యుద్ధం వల్ల ఏర్పడే పరిణామాలకు అమెరికానే కారణం అని రెడ్ క్రాస్ చీఫ్ ఆరోపించారు.  

సమావేశమైన భద్రతామండలి

ఇరాన్‌పై అమెరికా దాడులు చేయడంతో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అలెర్ట్ అయింది. ఆదివారం పొద్దుపోయిన తర్వాత భద్రతా మండలి అత్యవసరంగా సమావేశం అయింది. భద్రతా మండలిలో ఐదు శాశ్వత సభ్యదేశాలు, 10 తాత్కాలిక సభ్యదేశాలు ఉన్నాయి. శాశ్వత సభ్యదేశాల్లో అమెరికా కూడా ఒకటి కావడం గమనార్హం. 

చెన్నైకి తిరిగొచ్చిన లండన్ విమానం

బ్రిటీష్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ఆదివారం ఉదయం 6 గంటలకు చెన్నై నుంచి లండన్‌కు బయల్దేరింది. మరలా 8.30 గంటలకు విమానాశ్రయానికి తిరిగొచ్చింది. ఆ విమానంలో దాదాపు 200 మంది ప్రయాణికులు ఉన్నారు. మధ్యప్రాచ్యంలో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల వల్ల విమానం మరలా తిరిగివచ్చినట్టు పేర్కొన్నారు. 

అణుముప్పును ఆపేందుకే.. అలా అయితే మరిన్ని దాడులు

ప్రపంచానికి అణుముప్పును ఆపేందుకే ఇరాన్‌పై దాడులు చేసినట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. టెహ్రాన్ శాంతిని నెలకొల్పకపోతే దాడులు మరింత తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఇజ్రాయెల్‌తో కలిసి పని చేస్తామన్నారు. పశ్చిమాసియా దేశాలను ఇరాన్ భయబ్రాంతులకు గురి చేస్తోందని ఆరోపించారు. ఆ ప్రాంతాల్లో శాంతిని నెలకొల్పిల్సిన బాధ్యత టెహ్రాన్‌దే అని స్పష్టం చేశారు. అమెరికన్ దళాలు, ఇజ్రాయెల్ మిలటరీపై ట్రంప్ ప్రశంసలు కురిపించారు. పశ్చిమాసియా శాంతే తమకు ముఖ్యమని ప్రకటించారు. 

ఇరాన్ దాడులు తీవ్రతరం

ఇజ్రాయెల్‌లోని అనేక ప్రాంతాలపై ఇరాన్ క్షిపణి దాడులను తీవ్రతరం చేసింది. ఇరాన్ దాడులను ఇజ్రాయెల్ ఆర్మీ కూడా ధ్రువీకరించింది. తమ దేశం మీదకి ఇరాన్ క్షిపణులు దూసుకొస్తున్నాయని వాటిని అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిపింది. ఇరాన్ దాడులతో టెల్ అవీవ్, జెరూసలెం తదితర ప్రాంతాల్లో భారీగా పేలుళ్లు సంభవించాయి. ఈ దాడులతో ఇజ్రాయెల్ తన ప్రజలకు కీలక హెచ్చరికలు చేసింది.

క్షిపణుల నుంచి రక్షణ కోసం దేశ పౌరులు సురక్షిత ప్రాంతాల్లో దాచుకోవాలని సూచించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు పౌరులు సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని పేర్కొంది. దాదాపు 30 బాలిస్టిక్ క్షిపణులతో ఇరాన్ దాడి చేసినట్టు మీడియా నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇరాన్ బీకర దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ తమ గగనతలం మూసేస్తున్నట్టు ప్రకటించింది. క్షిపణి దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. 

పెరగనున్న చమురు ధరలు! 

ఇజ్రాయెల్ యుద్ధం వల్ల భారత్‌లో చమురు ధరలు పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇరాన్ ఆధీనంలో ఉన్న హర్మూజ్ జలసంధిని ఆ దేశం మూసివేసే దిశగా అడుగులు వేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇదే కనుక జరిగితే చమురు ధరలు పెరగడం ఖాయం అని చాలా మంది విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. హర్మూజ్ జలసంధి ప్రపంచ చమురు మార్కెట్‌కు జీవనాధారంగా ఉంది.

దీంతో ఇరాన్ ఈ జలసంధిని మూసివేస్తే చమురు ఉత్పత్తుల ధరలు పెరుగుతాయి. మన దేశం దిగుమతి చేసుకునే చమురులో 40 శాతం చమురు ఈ జలసంధి గుండానే రవాణా అవుతోంది. హర్మూజ్ జలసంధిని మూసివేయాలని ఇరాన్ చట్టసభ నిర్ణయించిందని ఓ చట్టసభ సభ్యుడు పేర్కొన్నారు. ఈ మార్గం నుంచి ప్రతిరోజు 2 కోట్ల బారెల్స్ చమురు వివిధ దేశాలకు వెళ్తుంది. కేవలం చమురు మాత్రమే కాకుండా లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్‌ఎన్‌జీ) కూడా ఈ మార్గం గుండా సరఫరా అవుతోంది. 

అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శాంతి కాముకుడని, ఆయన నోబెల్ శాంతి బహుమతిె 2026 కి అర్హుడని శనివారం పాకిస్థాన్ ప్రభుత్వం నోబెల్ జ్యూరీ బృందానికి ప్రతిపాదించింది. ఇది జరిగిన మర్నాడే అమెరికా ఇరాన్‌పై బాంబులతో విరుచుకుపడింది. దీంతో పాక్ పరిస్థితి.. ఓ సినీ కవి అన్నట్లు ‘అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి.. బోల్తాకొట్టిందిలే బుల్ బుల్ పిట్ట’ అన్నట్లయింది.

ఇటు పొరుగు దేశమైన ఇరాన్‌కు మద్దతు ప్రకటించలేక, అటు పెద్దన్న అమెరికాకు తలొంచలేక సతమతమవుతూనే.. ఇరాన్‌కు అనుకూలంగా ప్రకటన ఇవ్వాల్సి వచ్చింది. దీనిలో భాగంగానే ఆదివారం ఇస్లామాబాద్ నుంచి ప్రకటన వెలువడింది. అమెరికా అంతర్జాతీయ చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించి ఇరాన్‌పై దాడులకు పాల్పడుతున్నదని ఆరోపించింది.

యాఎన్ చార్టర్ ప్రకారం.. తన ప్రజలను రక్షించుకోవడానికి ఇరాన్ ఆత్మరక్షణ హక్కును వినియోగించుకోవచ్చని కూడా సూచించింది. ఇటీవల భారత్ పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పుడు ట్రంప్ ‘నిర్ణయాత్మకమైన దౌత్యపరమైన జోక్యం’ చేసుకున్నారని కొనియాడిన పాక్.. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధాన్ని కూడా ఆపుతారని కోతలు కోసింది. కానీ, ట్రంప్ ఇంతలోనే ట్విస్ట్ ఇచ్చాడు. ఇరాన్‌పై దాడులు చేయడంతో నోరెళ్లబెట్టడం పాక్ వంతైంది.

బీ బాంబర్లతో మొదలు.. 

ఇరాన్ మీద అమెరికా ‘ఆపరేషన్ మిడ్‌నైట్ హ్యామర్’ పేరుతో దాడులు జరిపింది. ఈ దాడులతో ఇరాన్‌లోని అణుకార్యక్రమానికి తీవ్ర విఘాతం కలిగిందని పెంటగాన్ పేర్కొంది. తాము యుద్ధాన్ని కోరుకోవడం లేదని పెంటగాన్ ప్రకటించడం గమనార్హం. ఓవైపు బాంబులతో విరుచుకుపడిన అగ్రరాజ్యం, యుద్ధాన్ని కోరుకోవడం లేదంటూ ప్రకటించడం విడ్డూరం.

ఆపరేషన్ మిడ్‌నైట్ హ్యామర్ వివరాలను అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్‌సేత్ మీడియాకు వెల్లడించారు. ‘ఇరాన్‌లో ఉన్న ప్రభుత్వాన్ని పడగొట్టాలనేది మా ఉద్దేశం కాదు. ట్రంప్ నుంచి వచ్చిన ఆదేశాలను పాటించి.. ఇరాన్ అణుకార్యక్రమాన్ని తీవ్రంగా దెబ్బతీశాం. మొత్తంగా 14 బంకర్ బస్టర్ బాంబులను జారవిడిచాం.’ అని పేర్కొన్నారు.

శుక్రవారం అర్ధరాత్రి (అమెరికా కాలమానం ప్రకారం) ప్రారంభమైన ఆపరేషన్ శనివారం తెల్లవారే వరకు కొనసాగింది. బీ బాంబర్లతో మొదలయిన యుద్ధవిమానాలు 18 గంటల ప్రయాణం అనంతరం ఇరాన్‌గగనతలాన్ని చేరుకున్నాయి. 30 వేల పౌండ్ల బరువు కలిగిన 14 బాంబులను ఇరాన్ అణుకేంద్రాలపై జారవిడిచారు.

ఇస్ఫాహన్ కేంద్రంపై తోమహక్ క్షిపణులను ప్రయోగించినట్టు ఆయన పేర్కొన్నారు. ఈ దాడి తెల్లవారుజాము వరకు జరిగిందన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తమ విమానాలు ఇరాన్ గగనతలంలోకి వెళ్లలేదని ప్రకటించగా.. రక్షణశాఖ మంత్రి మాత్రం అందుకు విరుద్ధంగా ప్రకటించారు.