05-06-2025 12:00:00 AM
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కార్పొరేషన్ డివిజన్ వార్డు, తహసిల్ పౌర సరఫరా మొదలైన ప్రాథమిక పరిపాలన కార్యాలయాలు చాలావరకు అధ్వాన్న స్థితిలో ఉన్నాయి. ఈ భవనాలను శుభ్ర పరచక పోవడంతో అవి అత్యంత భయంకరంగా దర్శనమిస్తుంటాయి. సున్నం, రంగులు వెలిసినా పట్టించుకోరు. కిటికీలు, తలుపులు మరీ దారుణంగా ఉంటాయి. మలమూత్ర శాలలైతే మరీ ఘోరం.
ఫైల్స్ భద్రపరచడానికి సరైన వ్యవస్థలు లేవు. కంప్యూటర్ ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులకు ఉపయోగించే కేబుల్స్, కరెంటు వైర్లు వేలాడుతుంటాయి. ప్రభుత్వాలకు ప్రజలకు ప్రధాన వారధులైన ఈ కేంద్రాల ఆలనా పాలన పట్టించుకోక పోవడం శోచనీయం.
గత ప్రభుత్వం రాష్ట్ర సచివాలయాన్ని, జిల్లాలలో కలెక్టర్ సమీకృత భవన సముదాయాలను అత్యాధునికంగా నిర్మించింది. కానీ, నగరంలోని మౌలిక కేంద్రాలపైన దృష్టి పెట్టకపోవడం విచారకరం. ఇప్పటికైనా క్షేత్రస్థాయి ప్రభుత్వ కార్యాలయాలను ఆధునీకరించే దిశగా ప్రస్తుత ప్రభుత్వమైనా తగు చర్యలు తీసుకోవాలి.
దండంరాజు రాంచందర్రావు, పాత బోయినపల్లి