21-06-2025 10:23:48 PM
ఘట్ కేసర్: ఆవుటర్ రింగ్ రోడ్డుపై టైర్ పగలటంతో వాహనం అదుపుతప్పి ఫల్టీ కొట్టగా అందులో ప్రయాణిస్తున్న ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలై ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. మరో నలుగురు స్వల్ప గాయాలతో ప్రమాదం నుండి తప్పించుకున్నారు. ఈ సంఘటన ఘట్ కేసర్ పోలీస్ స్టేషన్(Ghatkesar Police Station) పరిధిలోని ఆవుటర్ రింగ్ రోడ్ 9వ ఎగ్జిట్ సమీపంలో శనివారం చోటుచేసుకుంది. ఇన్ స్పెక్టర్ పరశురాం తెలిపిన వివరాల ప్రకారం... ఘట్ కేసర్ పట్టణంలోని ఓ ఆర్ ఆర్ ఎగ్జిట్ 9 సమీపంలో మేడ్చల్ నుండి పెద్ద అంబర్ పేట్ వైపు గాజుపలకల లోడుతో వెళ్తున్న మహేంద్ర మ్యాక్స్ ట్రక్కు (టీఎస్08 టీ 8943) టైరు పగిలింది.
దీంతో వాహనం అదుపుతప్పి ఫల్టీ కొట్టగా అందులో ప్రయాణిస్తున్న ఒడిస్సా రాష్ట్రానికి చెందిన లేబర్ రవి (25) గాజు పలుకల మధ్య చిక్కుకొని తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తి పాశ్వాన్ కుమార్ తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. మరో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఘట్ కేసర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గాయాలకు గురైన బాధితులను ఆసుపత్రికి తరలించారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం నగరంలోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు.