నూరుకు నూరు శాతం పదిలో ఉత్తీర్ణత సాధించాలి
జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి
భూత్పూర్: పదవ తరగతి వార్షిక పరీక్షల్లో మంచి మార్కులతో నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి విద్యార్థినిలకు సూచించారు. శనివారం భూత్పూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెగ్యులర్ గా పాఠశాలకు హాజరుకావాలని అన్నారు. పదవ తరగతి విద్యార్థినులతో కలెక్టర్ మాట్లాడి పాఠ్యాంశాల బోధన, ప్రత్యేక తరగతులు, మెనూ, మౌలిక వసతులపై అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం భోజనం అందుతుందా అడిగారు.
ఈ సందర్భంగా ఉపాధ్యాయులతో మాట్లాడుతూ రెగ్యులర్ గా పాఠశాలకు హాజరవుతూ సబ్జెక్టు విషయాల పట్ల ఎప్పటికప్పుడు అప్డేట్ గా ఉండాలని అన్నారు. పాఠశాల నిర్వహణ పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, పారిశుద్ధ్యం, విద్యార్థినిల ఆరోగ్యం, భోజనం, తదితర అంశాల పట్ల ఏలాంటి సమస్యలు రాకుండా చూడాలని ఆదేశించారు. వంట శాలలో విద్యార్థినులకు వండిన ఆహారంను పరిశీలించారు. విద్యార్థి నిలకు నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. కలెక్టర్ వెంట తహశీల్దార్ కిషన్ తదితరులు ఉన్నారు.




