ముస్లింల నిఖాకు ‘షరియా లా’నే వర్తిస్తుంది
కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు
బెంగళూరు, ఆగస్టు 10: ముస్లిం వివాహాలపై కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద రిజిస్ట్రేషన్ చేసుకున్నా.. ముస్లిం వివాహాలకు షరియా చట్టమే వర్తిస్తుందని కోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ డీకే. సింగ్, జస్టిస్ టీఎమ్. నదాఫ్ ధర్మాసనం ‘సజీద్ పర్వేజ్ వర్సెస్ ఫర్జానా తాజ్’ కేసులో ఫ్యామిలీ కోర్టు ఆదేశాలను సమర్థిస్తూ ఈ తీర్పునిచ్చింది. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద విడాకులు కోరుతూ భర్త దాఖలు చేసిన పిటిషన్ చెల్లదని డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది.‘నికాహ్’ను స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ (ఎస్ఎంఏ) కింద నమోదు చేసినంత మాత్రాన వివాహ మూల స్వభావం మారదని పేర్కొంది.
ముస్లిం పర్సనల్ లా ప్రకారం జరిగిన పెళ్లిళ్లకు షరియా చట్టమే వర్తిస్తుందని తెలిపింది. విదేశీ ప్రయాణాలు/ వీసా కోసం స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ (ఎస్ఎంఏ) కింద పెళ్లి రిజిస్టర్ చేసుకున్నంత మాత్రాన ముస్లిం పర్సనల్ లా రద్దు కాదని తేల్చి చెప్పింది.‘నికాహ్’ చేసుకున్న దంపతులు విడాకుల కోసం స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ను ఆశ్రయించలేరని వెల్లడించింది. వ్యక్తిగత చట్టాల ప్రకారం జరిగిన వివాహాలకు ఆయా మతపరమైన నిబంధనలే వర్తిస్తాయని హైకోర్టు డివిజన్ బెంచ్ తెలిపింది. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద విడాకులు పొందాలంటే.. వివాహం కూడా అదే చట్టం కింద జరిగి ఉండటం తప్పనిసరని పేర్కొంది.






