08-01-2026 12:49:33 AM
చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’. వెంకటేశ్ కీలక పాత్రతో నటిస్తున్న ఈ చిత్రంలో నయనతార కథానాయిక. సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానున్న ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ బుధవారం హైదరాబాద్లో జరిగింది. ఈ ఈవెంట్లో చిరంజీవి మాట్లాడుతూ.. “ఈ సంక్రాంతి కేవలం ‘శంకర వరప్రసాద్’దే కాదు..
మొత్తం తెలుగు సినిమా పరిశ్రమది అవ్వాలని కోరుకుంటున్నా. అలాంటి విజయాలు ప్రేక్షకులు ఇచ్చి తీరుతారనే ప్రగాఢ నమ్మకం నాకు ఉంది. 2026 సంక్రాంతి తెలుగు చిత్ర పరిశ్రమ మర్చిపోకూడదు. అనిల్లాంటి డైరెక్టర్ ఉన్నప్పుడు ఈ క్యారెక్టర్ చాలా కేక్ వాక్లాగా చేయగలరు. వెంకటేశ్తో సినిమా చేయడం చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. తనతో కూర్చుంటే చాలా ఫిలాసఫికల్గా అనిపిస్తుంది.
మోడరన్ డ్రెస్ వేసుకున్న చిన్న సైజు గురువులాగా అనిపిస్తుంటాడు. నా బిడ్డ సుస్మిత ఇండస్ట్రీకి వస్తానని చెప్పినప్పుడు కష్టపడి పని చేస్తే ఇక్కడ ఖచ్చితంగా ఆదరిస్తారని చెప్పాను. ఈ పరిశ్రమలో నాకు అన్ని రకాలుగా భుజం కాస్తూ ఇంటికి పెద్ద బిడ్డ అయినందుకు ఆ పెద్దరికన్ని సొంతం చేసుకుంటూ నాకు అన్ని విధాలా చేదోడు వాదోడుగా ఉంది. రామ్చరణ్తోపాటు తను నాకు మరో బిడ్డ” అన్నారు. వెంకటేశ్ మాట్లాడుతూ.. “చిరంజీవితో వర్క్ చేయడం వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. నేను తమ్ముళ్లు పవన్కళ్యాణ్, మహేశ్లతో మల్టీ స్టార్స్ చేశాను. ఇప్పుడు అన్నయ్యతో చేస్తున్నా.
సౌండ్ ఇంకా గట్టిగా ఉండాలి. ఇదే సంక్రాంతి స్పిరిట్” అన్నారు. డైరెక్టర్ అనిల్ మాట్లాడుతూ.. “చిరంజీవి, వెంకటేశ్ని ఒకే ఫ్రేమ్లో చూడాలనేది ఎన్నో ఏళ్ల కల. అది నాకు కుదిరింది. అది నా అదృష్టంగా భావిస్తున్నా. తెలుగు సినిమా చరిత్రలో వారి కాంబినేషన్ మెమొరబుల్గా మిగిలిపోతుంది” అన్నారు.
ప్రొడ్యూసర్ సుస్మిత కొణిదెల మాట్లాడుతూ.. “ఈ సినిమా నా జీవితంలో బిగ్ మైల్స్టోన్ ప్రాజెక్ట్. సంక్రాంతికి ఒక సినిమా రిలీజ్ చేయడమే చాలా పెద్ద విషయం. అలాంటిది డాడీ సినిమాతో మీ ముందుకు రావడం చాలా గొప్ప విషయం” అన్నారు. ప్రొడ్యూసర్ సాహు గారపాటి మాట్లాడుతూ.. “ఏ ప్రొడ్యూసర్కైనా ఒక స్టార్ హీరోతో చేయడమే అదృష్టం. అలాంటిది నాకు ఇద్దరు స్టార్స్తో చేసే అవకాశం దొరికింది. చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాతో మొత్తం అదిరిపోద్ది” అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్రబృందం పాల్గొన్నారు.