09-01-2026 01:15:29 PM
హైదరాబాద్: సెంట్రల్ యూనివర్సిటీ భూముల్ని(Central University lands) గుంజుకునే ప్రయత్నం చేసిన రేవంత్ కాంగ్రెస్ సర్కార్, ఇప్పుడు ఉర్దూ యూనివర్సిటీ భూములను, ఐఎస్బీ భూములను దోచుకోవాలని చూస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) ఆరోపించారు. బంజారాహిల్స్ నందినగర్ నివాసంలో మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ విశ్వవిద్యాలయం(Maulana Azad National Urdu University) విద్యార్థులతో కేటీఆర్ సమావేశమయ్యారు. ఉర్దూ వర్సిటీ భూములకు సంబంధించిన ప్రభుత్వ నోటీసుల దృష్ట్యా ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం సీరియల్ స్నాచర్ గా వ్యవహరిస్తోందని, ప్రభుత్వ భూములు లాక్కోవడం ఇదే మొదటిది కాదన్నారు.
జయశంకర్ వ్యవసాయ వర్సిటీ(Jayashankar Agricultural University) నుంచి వంద ఎకరాలు తీసుకున్నారని ధ్వజమెత్తారు. వర్సిటీ భూములపై విద్యార్థులు పోరాడినా ఆందోళనను అణచివేశారని సూచించారు. హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలోనూ ఇదే విధమైన భూదందా చేశారని ఆరోపించారు. హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీకి(Hyderabad Central University) సంబంధించి 400 ఎకరాలు తీసుకునేందుకు ప్రయత్నించారని తెలిపారు. సుప్రీంకోర్టు సీజే సుమోటోగా తీసుకుని ఆదేశాలు ఇచ్చే వరకు రాష్ట్రం, కేంద్రం పట్టించుకోలేదని విమర్శించారు. వర్సిటీ భూములపై సుప్రీంకోర్టు సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీని వేసిందని గుర్తుచేశారు. ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ ముఖ్యమంత్రి అయితే.. రాష్ట్రం ఇలాగే ఉంటుందని మండిపడ్డారు.
కాంగ్రెస్ హామీ ఇచ్చిన రెండు లక్షల ఉద్యోగాలు ఏమైయ్యాయని నిరుద్యోగులు రోడ్డెక్కితే వాళ్ళని ఇష్టం వచ్చినట్లు కొట్టి, నిర్భంధించిందని కేటీఆర్ పేర్కొన్నారు. మరో రెండున్నరేళ్లలో తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ(BRS Party) అధికారంలోకి రాగానే మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీకి నిధులు ఇచ్చి అభివృద్ధి చేస్తాం, మనూ విద్యార్థులకు మద్దతుగా ఉంటామని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఢిల్లీలో పోరాటం చేయడానికి కూడా యూనివర్సిటీ విద్యార్థులతో కలిసి వెళ్తామన్న కేటీఆర్ రాజ్యసభలో కూడా ఈ అంశంపై మాట్లాడతామని స్పష్టం చేశారు.